Geetha Kannan | ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతుందని నిరూపించింది తమిళనాడుకు చెందిన గీతా కన్నన్. ఇటీవల తేనిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ ఈత పోటీల్లో వివిధ విభాగాల్లో ఆమె బంగారు పతకాలు సాధించింది. మామూలుగా అయితే 42 ఏండ్ల గీత నేలమీద చక్రాల కుర్చీకే పరిమితమవుతుంది. కానీ ఒక్కసారి స్విమింగ్ పూల్లో దిగితే మాత్రం ఆమె చేపలా ఈదుతుంది. “నేలమీద చక్రాల కుర్చీకే పరిమితమైనా… నీళ్లలో మాత్రం నాకు పక్షిలా ఎగురుతున్న అనుభూతి కలుగుతుంద”ని చెబుతుంది గీత. తనకు ఆర్నెల్ల వయసప్పుడే పోలియో బారినపడింది. దీనికితోడు 2016లో కారు ప్రమాదంలో చేతులకు బలమైన గాయాలయ్యాయి. అలా గీత చిన్నవస్తువును కూడా ఎత్తలేని పరిస్థితికి చేరుకుంది. భర్త కన్నన్ ఎంతోమంది డాక్టర్లను కలిశారు.
అయితే, సర్జరీకి ఒప్పుకోకపోవడంతో ఆ నొప్పిని ఓ ఏడాదిపాటు అనుభవించింది. అప్పుడే గీతను వాళ్ల స్నేహితుడు స్విమింగ్ శిక్షణలో చేర్పించాడు. దీంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆత్మవిశ్వాసమూ పెరిగింది. రోజుకు రెండు గంటలపాటు స్విమింగ్ పూల్లో గడిపే గీత అవసరాలను భర్త కన్నన్ చూసుకుంటాడు. “నేను ఎక్కడికైనా కదలాలంటే ఇతరుల మీద ఆధారపడతాను. ఒక్క ఈదడం మాత్రమే సొంతంగా సాధన చేస్తాను” అంటుందామె.