శాశ్వతి.. హర్యానాకు చెందిన యువతి. మేనేజ్మెంట్ పట్టభద్రురాలు. ముందు నుంచీ సేద్యం అంటే ప్రేమ. గతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె భర్త దీపాంకర్ జైన్ అగ్రి మార్కెటింగ్లో నిపుణుడు. ఆ ధైర్యంతోనే సాగుబడి సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకుని.. వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే బాధ్యత తీసుకున్నది. రైతుల అవసరాలు, సమస్యలు నేరుగా కంపెనీలకు తెలియజేస్తున్నది.
ఇందుకు వేదికగా.. ‘డిజీటెక్’ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే ఈ సేవల్ని 4.2 కోట్ల మంది రైతులు ఉపయోగించు కుంటున్నారు. ఈ వేదిక వల్ల అగ్రి కంపెనీలవాళ్లు ఏజెంట్లు, పంపిణీదార్లతో సంబంధం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చు. ఫలితంగా రైతులకు భారీ డిస్కౌంట్లు అందుతాయి. తక్కువ ధరకే ఆధునిక వ్యవసాయ సామగ్రి లభిస్తుంది. ఇక కంపెనీలకు సేల్స్ సిబ్బందితో పెద్దగా అవసరం ఉండదు. అలా జీతభత్యాల బరువు తగ్గుతుంది. కాబట్టే గోద్రెజ్, బేయర్, కోరమాండల్, బీఏఎస్ఎఫ్ లాంటి పెద్ద కంపెనీలు శాశ్వతి స్టార్టప్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఈ సేవల్ని బంగ్లాదేశ్, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, అమెరికాకు విస్తరించే పనిలో ఉన్నది శాశ్వతి.