కీలక పరిశోధన సంస్థల అత్యున్నత విభాగం.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్ నల్లతంబి కలైసెల్వి వ్యక్తిత్వం నిరుపమానం. ఆమె ప్రతిభ కలిగిన ఎలక్ట్రో కెమికల్ సైంటిస్ట్ కూడా. లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని పెంచే మార్గాన్ని కనిపెట్టి పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చారు. స్వరాష్ట్రం తమిళనాడులో చవకైన టాయిలెట్ల నిర్మాణానికి ఓ నమూనా అందించారు. కలైసెల్వి ప్రాథమిక విద్యాభ్యాసమంతా తమిళ మాధ్యమంలోనే సాగింది.
మాతృభాషలో చదువుకోవడం వల్లే తనలో జిజ్ఞాస పెరిగిందని అంటారు. కలైసెల్వి తండ్రి ఉపాధ్యాయుడు. ‘అచ్చంగా అబ్బాయిలానే పెంచారు నన్ను. దాంతో మగపిల్లలతో కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ ఆడేదాన్ని’ అని నవ్వుతూ చెబుతారు. కలైసెల్వి మంచి వక్త కూడా. కాలేజీ రోజుల్లో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొన్నారు. ఉద్యోగంలో చేరాక కూడా ఆకాశవాణిలో సైన్స్ మీద ఉపన్యాసాలు ఇచ్చారు. ‘ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం’ అంటారామె.