షాలిని కేడియా.. ముంబైకి చెందిన ఆరోగ్య ఉద్యమకారిణి. ఫ్రాజల్ ఎక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు. తనో ఏకవ్యక్తి సైన్యం. నివాస సముదాయాల దగ్గరికి వెళ్లి.. మైకు పట్టుకుని నిలబడతారు. తాను చెప్పే మాటలు ఆలకించమని అభ్యర్థిస్తారు. ‘ఎవరికి తెలుసు? మూడున్నర వేలమందిలో మీ బాబు ఒకడు కావచ్చు. నాలుగువేల మందిలో మీ పాప ఒకరు కావచ్చు. ఫ్రాజల్ ఎక్స్ సిండ్రోమ్ ఎవరినైనా బాధించొచ్చు. ఆ లక్షణాలు తెలిస్తే.. చికిత్స సులభమే’ అని మొదలుపెడతారు.
అప్పటికే జనం గుమిగూడి ఉంటారు. చిట్టచివరి వ్యక్తి సందేహాన్ని కూడా తీర్చేశాకే అక్కడి నుంచి కదులుతారు షాలిని. ఆన్లైన్లోనూ ఆమె చురుగ్గా ఉంటారు. ప్రతి సామాజిక మాధ్యమాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో డీఎన్ఏ పరీక్ష చేయించడం ద్వారా ఫ్రాజల్ ఎక్స్ సిండ్రోమ్ బయటపడుతుంది. ఇదో జన్యుపరమైన రుగ్మత. దీనివల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపిస్తుంది. ముద్దముద్దగా మాట్లాడతారు. బెరుకు బెరుకుగా ఉంటారు. ఇట్టే కోపం, ఏడుపు వచ్చేస్తాయి. తానే స్వయంగా ఓ పన్నెండువేల మందికి పరీక్షలు చేయించారు శాలిని. ముప్పై రెండు సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఈ జన్యు సమస్యను గుర్తించారు.