శాంతికి చిహ్నం పావురాలు. వాటికి నేస్తం సయ్యద్ అబ్దుల్ షకీర్. హనుమకొండ జిల్లా కాజీపేట బాపూజీనగర్కు చెందిన షకీర్ బైక్ మెకానిక్. ఏ బైక్నయినా నిమిషాల్లో బాగు చేస్తాడు. ఇష్టమైన వ్యాపకం మాత్రం పావురాల పెంపకం. తన ఇంటికి వెళ్తే దేశదేశాలకు చెందిన జంట కపోతాలు కనిపిస్తాయి.
షకీర్కు మొదటి నుంచీ పావురాలు అంటే ఇష్టం. స్థానికంగా దొరికిన వాటిని పెంచుకునేవాడు. 2015లో హైదరాబాద్లో ఇండియన్ ఫ్యాన్టెయిల్ పావురాల జంటను రూ.2వేలకు కొనుగోలు చేశాడు. వాటిని అపురూపంగా చూసుకునేవాడు. ఇక అప్పటినుంచి రకరకాల పావురాలను సేకరించడమే వ్యాపకంగా పెట్టుకున్నాడు.
వివిధ దేశాలకు చెందిన వంద జంటలకు పైగా పావురాలు ఇప్పుడు అతని నివాసంలో ప్రత్యేకంగా తయారు చేసిన బోన్లలో అచ్చికలాడుతూ కనిపిస్తాయి. హంగేరియన్ జాయింట్ హౌజ్, లాహోరీ సిరాజీ, సైబీరియన్ ఒమాస్కీ, అమెరికన్ ప్యానెల్డ్ ఇలా వివిధ దేశాలకు చెందిన రకరకాల పావురాలు అతని లోగిలిలో సేదతీరుతున్నాయి. వీటిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. పావురాల నిర్వహణకు నెలకు రూ.12వేల వరకూ వెచ్చిస్తున్నాడు.
ఈ పావురాల జతగాడు ఫ్యాన్సీ పీజియన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ పీజియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉన్నాడు. ‘ఫ్యాన్సీ పీజియన్స్ కేర్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ, పావురాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నాడు. అతని ఒడిలో పెరిగిన పావురాలు వివిధ పోటీల్లో మెరిసి బహుమతులు సాధిస్తున్నాయి. గతేడాది కేరళలో జరిగిన జాతీయస్థాయి పీజియన్ షోలో ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నాయి. గత జనవరిలో యునైటెడ్ పీజియిన్ క్లబ్ నిర్వహించిన ఫ్యాన్సీ పావురాల షోలో హంగేరియన్ కేటగిరీలో మొదటి బహుమతి తెచ్చి పెట్టాయి. ఇటీవల గుజరాత్ పీజియన్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పావురాల సంరక్షణ సెమినార్లో షకీర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొనడం విశేషం.
…? పిన్నింటి గోపాల్ గొట్టె వెంకన్న