ఆదిహిందూ ఉద్యమం ఆధ్వర్యంలో.. 1942లో హైదరాబాద్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి డాక్టర్ అంబేద్కర్ వస్తున్నారని సదాలక్ష్మికి తెలిసింది. అప్పుడు ఆమె వయసు పన్నెండు. లక్ష్మి వాళ్ల నాన్న పారిశుద్ధ్య కార్మికుడు. తమలాంటి నిమ్న జాతుల కోసం పనిచేసే అంబేద్కర్ను ఎలాగైనా చూడాలనుకుంది. అప్పటికే ఆమె గాంధేయ వాదులు నడిపే బాలల సంఘంలో సభ్యురాలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుర్రపు బగ్గీపై బొల్లారం నుంచి హైదరాబాద్ వచ్చింది. అంబేద్కర్ ఉపన్యాసం విన్నది. ఆ సభ తన జీవితాన్నే మలుపుతిప్పింది.
తర్వాతి కాలంలో ఆమె కాంగ్రెస్, మరికొన్ని పార్టీల్లో పనిచేశారు. ఉన్నత విద్యను పక్కనపెట్టి ఎన్నికల రాజకీయాల్లో దిగారు. ఉభయ సభల సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పలు హోదాలు చేపట్టారు. 1963లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటే అగ్రనేతలు ఏమనుకుంటారోనని కాంగ్రెస్లోని కొంతమంది నేతలకు భయం పట్టుకుంది. ఎందుకొచ్చిన గొడవని మౌనంగా ఉండిపోయారు. కానీ సదాలక్ష్మి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకూ చొరవ తీసుకున్నారు. ‘బాబా సాహెబ్ నా వ్యక్తిత్వ రూపశిల్పి. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను’ అనేవారామె.