భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) మహిళలకోసం ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’ అనే ప్రత్యేక విభాగాన్ని నడుపుతున్నది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త రీతూషా దీనికి చైర్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించి.. మహిళా ఆంత్ర ప్రెన్యూర్లకు దిక్సూచిగా మారారు. తనదైన పరిశోధనతో తెలంగాణ కళలపై ఒక పుస్తకాన్నీ తీసుకువస్తున్నారు రీతూ. ఆ ప్రయాణం ఆమె మాటల్లో..
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాన్న శివశంకర్ అగర్వాల్ పేరున్న వ్యాపారవేత్త. రబ్బరు ట్యూబుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు. నేను పెండ్లాడింది కూడా హైదరాబాదీనే. మా వారు అమిత్ షా. హరిద్వార్ హోటల్స్, క్రీమ్స్టోన్, స్కూప్స్ ఐస్క్రీమ్స్ తదితర వ్యాపారాలు ఉన్నాయి. పెండ్లయిన నాటి నుంచి నేను కూడా కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నా. మా మామగారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. అయినా సరే ఎక్కడో చిన్న అసంతృప్తి. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కావాలనిపించేది. అందుకే రెండో బిడ్డ పుట్టాక జువెలరీ డిజైనింగ్, డైమండ్ గ్రేడింగ్, జెమాలజీ క్షుణ్నంగా అధ్యయనం చేశాను. నేను డిజైన్ చేసిన నగలతో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించాను. వాటికి మంచి స్పందన లభించేది. దీంతో ‘రీతూస్ కస్టమైజ్డ్ డిజైనర్ జువెలరీ’ పేరిట నగల తయారీ సంస్థను నెలకొల్పాను. ఆభరణాల వ్యాపారం నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. సృజనాత్మక డిజైనర్గా నన్ను సమాజానికి పరిచయం చేసింది. నా జీవితంలో ఇదో ముఖ్యమైన మలుపు. ఓ సంస్థను సమర్థంగా నిర్వహించడం సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అన్నిటినీ చిరునవ్వుతో ఎదిరించాను. నా కల నిజం చేసుకున్నాను.
నలుగురి కోసం
నా వంతుగా సమాజానికి ఎంతోకొంత తిరిగిఇవ్వాలనే ఉద్దేశంతో నేను, మా తమ్ముడు, అతని స్నేహితులు తలోచేయి వేసి.. కృపా ఫౌండేషన్ స్థాపించాం. దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాలతో పాటు, బేగంపేట్లోని అంధ విద్యార్థుల బడిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ విద్యా సంస్థల అవసరాలను బట్టి ఆర్థిక సాయం అందిస్తున్నాం. మా ఫౌండేషన్ ద్వారా దాదాపు ఎనభై మంది పేద పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లారు. ప్రయోజకులు అయ్యారు. మన చుట్టూ ఉన్న మనుషుల ముఖంలో నవ్వు కనిపిస్తేనే మనం సంతోషంగా ఉండగలం అని నమ్ముతాన్నేను. నాకు తొలినుంచీ చేనేత వస్ర్తాలంటే ప్రాణం. నా దగ్గర అన్ని రకాల నేత చీరలూ ఉన్నాయి. అందులోనూ ఇక్కత్ బాగా నచ్చుతుంది.
ఒకసారి పుట్టపాక వెళ్లాను. అక్కడ తేలియా రుమాల్ తయారీ విధానం నన్ను ఎంతో ఆశ్చర్యపరచింది. అదో సంక్లిష్టమైన ప్రక్రియ. దారాలకు రంగులేయడం ఎంతో కష్టం. అందుకే ఫిక్కీ సంస్థ ద్వారా తేలియా రుమాల్ను దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ప్రోత్సాహం కరువైతే ఓ గొప్ప పనితనం మరుగునపడిపోతుంది. మన మట్టి మీద ప్రేమతో.. తెలంగాణ కళలు, సంస్కృతి మీద మూడు వందల పేజీల పుస్తకం రాశాను. అందుకోసం ఎనిమిది నెలలకు పైగా లోతైన అధ్యయనం చేశాను. చేనేత, నగలు, వారసత్వ ప్రదేశాలు.. ఇలా పది అధ్యాయాలున్న ఈ పుస్తకాన్ని నెలాఖరులో ఆవిష్కరించనున్నాం. ఇందులో అషుర్ఖానా, పురానా హవేలి, దోమకొండ కోట లాంటి వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నా. తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పే రచన ఇది.
మాది ఉమ్మడి కుటుంబం. నాకు ఇద్దరు పిల్లలు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే వ్యాపారం నిర్వహించడం అలవాటైంది. మనం ఏ స్థానంలో ఉన్నా మహిళగా అన్ని బాధ్యతలూ నిర్వర్తించాల్సిందే. అలా అని ఎప్పుడూ మన మెదడులో అడ్డుగోడలు నిర్మించుకోకూడదు. స్వేచ్ఛగా ఆలోచించగలిగితేనే లక్ష్యాన్ని సాధించగలం.
మహిళల అభివృద్ధి లక్ష్యంగా..
ఫిక్కీతో నా అనుబంధం పద్దెనిమిది ఏండ్లుగా కొనసాగుతున్నది. ట్రెజరర్, ప్రోగ్రామ్ డిజైనర్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశాను. ఇప్పుడు చైర్పర్సన్! ఈ ప్రస్థానం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ ఏడాది మా లక్ష్యం…సస్టెయినింగ్ హర్ ఎబిలిటీస్.. మహిళ సామర్థ్యాల అభివృద్ధికి తోడ్పడటం. లక్ష్యాలు, సంస్కృతి, విద్య, ఆరోగ్యం.. ఈ నాలుగు అంశాలూ మూలస్తంభాలుగా ముందుకు వెళ్తాం. ఐడియా స్థాయి నుంచే మహిళావ్యాపార వేత్తలకు తోడుగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పటికే వ్యాపారాలు నడుపుతున్నవారు సమకాలీన పరిజ్ఞానాన్ని, ఆధునిక నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మా వంతుగా సాయపడుతున్నాం. ఆ ప్రయత్నంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సహకారం తీసుకునే ఆలోచన ఉంది. ఫిక్కీ బోర్డు స్థాయిలో మరింత మంది మహిళల్ని చూడాలని నా ఆకాంక్ష. రీతూషా తన భర్త వ్యాపారంలో పాలుపంచుకుంటున్నది అని అనిపించుకోవడం కన్నా, రీతూషా ఒక జువెలరీ డిజైనర్, ఫిక్కీ ప్రతినిధి.. ఇలా అనిపించుకోవడం నాకు సంతోషాన్నిస్తుంది. ఆ ముద్ర కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి