నర్గీస్ మొమ్మంద్ హసన్జాయ్.. తాలిబన్ల ఫత్వాలను ధిక్కరించింది. అఫ్గానిస్థాన్లో మానవహక్కుల ఉల్లంఘనను నిరసించింది. అనేకానేక పరిమితుల మధ్య బతుకుతున్న మహిళలకు మనోబలాన్ని ఇచ్చింది. ఆ చొరవకు గుర్తింపుగా ప్రపంచ శాంతి బహుమతికి ఎంపిక చేసింది ఓ స్వీడన్ సంస్థ. నర్గీస్ గతంలో కాబుల్ వర్సిటీలో ఉపన్యాసకురాలిగా పనిచేసింది. మానవ హక్కుల న్యాయవాదిగానూ వ్యవహరించింది. ఇప్పటికీ అఫ్గాన్లో తాలిబాన్ ముష్కరుల కనుసైగలే ఫత్వాలుగా అమలు అవుతున్నాయి. అక్కడ బాలికలకు విద్యాసంస్థలలో ప్రవేశం లేదు. ఉద్యోగాలు సైతం కొన్ని రంగాలకే పరిమితం. పార్కులు, జిమ్లు స్త్రీలకు నిషిద్ధం.
అంతర్జాతీయ దేశాలు గళమెత్తినా తాలిబన్లు పట్టించుకోలేదు. ‘ఇది మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యం అనవసరం’ అంటూ ఎదురుతిరిగారు. ఆ గడ్డ మీద ఆటవికమైన పాలన సాగిస్తున్నారు. నర్గీస్ ఈ వివక్షను, దురహంకారాన్ని ప్రశ్నించింది. ఓ మహిళ తమకు ఎదురొడ్డి నిలవడం.. ఆ ఛాందసవాదులకు కంటగింపుగా మారింది. ఆమెను హతమార్చే ప్రయత్నమూ చేశారు. కానీ నర్గీస్ బెదరలేదు, ఆమె బనోబలం చెదరలేదు. ‘గత రెండేండ్లుగా బడి మొహం చూడని బాలికలకు ఈ పురస్కారం అంకితం’ అని ప్రకటించిందామె. బాలికా విద్య, శాంతి, భావప్రకటన స్వేచ్ఛ .. తదితర రంగాలలో అసాధారణమైన కృషి చేసినవారికి ఈ అవార్డును బహూకరిస్తారు.