అమ్మానాన్నలు ఏ లక్ష్యం కోసమైతే అడవిబాట పట్టారో.. ఆ ఆశయాన్ని సాధించడానికి ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాష్ట్ర సమితి జెండాలో అన్నల అజెండాను దర్శించారు. మావోయిస్టు దంపతుల ముద్దుబిడ్డ బడే నాగజ్యోతి ములుగు రాజకీయాలలో వెలుగురేఖగా నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ పోరులో సునాయాస విజయానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇప్పటికే, నియోజకవర్గంలో మూలమూలకూ వెళ్లారు. జనం సమస్యలు విన్నారు. కష్టాలకు కరిగిపోయారు. కన్నీళ్లు తుడిచారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జ్యోతక్క.
ఉద్యమాల చరిత్ర.
పోరాటాల నేపథ్యం.
త్యాగాల వారసత్వం.
చురుకైన ప్రజా జీవితం.
ఇవే.. బడే నాగజ్యోతిని బడా లీడర్లకు దీటైన నాయకురాలిగా తీర్చిదిద్దాయి. మూడు పదులు నిండకుండానే ముఖ్యమంత్రి దృష్టిన పడేలా చేశాయి. బీఆర్ఎస్ గెలుపు గుర్రాల జాబితాలో చోటు కల్పించాయి. అసెంబ్లీ వైపుగా అడుగులు వేయిస్తున్నాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి.. నాగజ్యోతి స్వగ్రామం.
మావోయిస్టు దంపతులు బడే నాగేశ్వర్ రావు- రాజేశ్వరి ముద్దుబిడ్డ ఆమె. కన్నవారు తాడిత పీడిత ప్రజల కోసం అడవిబాట పట్టి అమరులయ్యారు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగజ్యోతి.. అసెంబ్లీ సాక్షిగా అణగారిన వర్గాల సేవకు అంకితం అవుతానని ప్రతిన బూనుతున్నారు. వనదేవతలు నడయాడిన నేలలో జనదేవతల ఆశీస్సుల కోసం ఆమె బయల్దేరారు.
అడవి తల్లి ఒడిలో..
నాగజ్యోతి.. అడవిలో పుట్టారు. అమ్మ పేగు తెంచుకుని భూమి మీద పడే సమయానికి ..చుట్టూ దుర్గమమైన అరణ్యం. కనుచూపు మేరలో క్రూరమృగాలు. మావోయిస్టుల కవాతు పద ఘట్టనలు. తుపాకుల పేలుళ్లు, మందుపాతరల విస్ఫోటనాలు, నిరంతర ప్రయాణాల వల్ల పసిబిడ్డకు ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతో కాల్వపల్లిలోని తన తల్లిదండ్రులకు సంరక్షణ బాధ్యతలను అప్పగించి తిరిగి అడవిబాట పట్టారు నాగేశ్వర్ రావు. తదనంతర కాలంలో జరిగిన ఎదురు కాల్పులలో నాగేశ్వర్రావు-రాజేశ్వరి దంపతులు మృతి చెందారు. అప్పటినుంచీ తాతయ్య, నానమ్మలే నాగజ్యోతికి సర్వస్వం. మనవరాలికి ఏ లోటూ తెలియకుండా పెంచారు. నాగజ్యోతికి కూడా బాల్యం నుంచే బాధ్యత తెలుసు. కాల్వపల్లి, తాడ్వాయి ఆశ్రమ పాఠశాలల్లో.. హనుమకొండ చైతన్య హైస్కూల్లో ఆమె పాఠశాల విద్య పూర్తయింది. ఏటూరు నాగారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. హనుమకొండలో పీజీ చేశారు. ఉపాధ్యాయురాలు కావాలనే కోరికతో బీఈడీ కూడా పూర్తి చేశారు. కానీ, వారసత్వంగా వచ్చిన ప్రజాసేవ వైపే అడుగులు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాల్వపల్లి సర్పంచ్గా గెలుపొందారు.
అదే సంవత్సరం టీఆర్ఎస్ నుంచి తాడ్వాయి జడ్పీటీసీగా విజయం సాధించారు. 2020లో వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎట్టి జగదీష్ను పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. నాగజ్యోతి కుటుంబ ఉద్యమ నేపథ్యం, ప్రజాసేవ పట్ల బలీయమైన ఆకాంక్ష గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆమెకు ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్నూ చేశారు. తాజాగా ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. నాగజ్యోతికి మొదటి నుంచీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారు. జూన్ 7న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ములుగులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో జ్యోతిని సూచన ప్రాయంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పరిచయం చేశారు. ఆ తర్వాత, సీఎం కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్కు పిలిపించుకొని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ.. ములుగు వెలుగురేఖ నాగజ్యోతి పేరుకూ జాబితాలో చోటిచ్చారు. ఆ వ్యూహాత్మక ప్రకటనతోనే నాగజ్యోతి సగం విజయం సాధించారు. మిగతా సగం.. సునాయాసమే. కుటుంబ నేపథ్యం, పల్లెపల్లెకూ విస్తరించిన బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు.. అక్షౌహిణులకొద్దీ సైన్యంలా ఆమె వెనుక నిలుస్తున్నాయి. ‘ఓ తండ్రిలా దిశానిర్దేశం చేసిన కేసీఆర్కు ములుగు ఘన విజయాన్ని కానుకగా అందిస్తాను’ అంటున్నారు నాగజ్యోతి భావోద్వేగంతో.
…? బోయిన్పల్లి శ్రీధర్ రావు