కొత్తవి వింతగా అమ్ముడుపోయే మార్కెట్లో పాతవి అమ్మడం కళే! ఒక తరం ఆస్వాదించిన సంప్రదాయ రుచుల్ని ఈ తరం అంతకన్నా ఇష్టంగా తినేలా తన పాకశాస్త్ర కళతో మెప్పిస్తున్నది దేవరగట్ల లక్ష్మీ హరిత భవాని. ఇంజినీరింగ్ చదివిన ఆమెసాంకేతిక ప్రస్థానాన్ని కాదని, పాకశాస్త్ర అస్ర్తాల్ని చేపట్టింది. కార్పొరేట్ కొలువు కాదనుకొని.. చిరుధాన్యాలకూ, పిండివంటలకూ దోస్తీ కుదిర్చింది. ఆరోగ్యకరమైన వంటకాలతో వ్యాపారంలో కుదురుకుంది. ‘సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టార్టప్ ఆంత్రప్రెన్యూర్’గా పురస్కారం అందుకున్న మిల్లెట్ వంటలక్క ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
మా అమ్మ ఉమామహేశ్వరి వ్యవసాయ అధికారి. రైతులకు సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం గురించి అవగాహన కల్పించేది. మా ఊరు కోదాడకు సమీపంలోని చెన్నకేశవపురం. మా ఊరికి దగ్గర్లోని వ్యవసాయ క్షేత్రాలను చూసేందుకు వెళ్తూ.. అమ్మ నన్ను కూడా తీసుకుపోయేది. అలా స్థానిక పంటల గురించి, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల అవసరం గురించి చిన్నప్పుడే తెలిసి వచ్చింది. రైతులకు చెప్పడమే కాదు.. అమ్మ ఇంట్లో ఆచరణలో పెట్టింది. మా కోసం జొన్న రొట్టెలు, రాగి జావ లాంటి సంప్రదాయ పదార్థాలు చేసేది. అలాంటి పరిస్థితుల్లో పెరగడం వల్ల సంప్రదాయ రుచులంటే ఆసక్తి ఉండేది. పెద్దయ్యాక ఫుడ్ ఇండస్ట్రీ నడపాలని ఎప్పుడూ అనుకునేదాన్ని.
అమ్మ మాట బంగారు బాట
ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్లో చేరాను. ఎంటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి కాగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరాను. అయిదేండ్లు పని చేశాను. పెండ్లి కాగానే ఉద్యోగం మానేశాను. అబ్బాయి పుట్టిన తర్వాత సోలార్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. పొద్దున ఎనిమిది గంటలకు వెళ్తే.. ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయ్యేది. నా కొడుకును మా అమ్మే చూసుకునేది.
ఆ కష్టాలు వద్దనుకుని ఉద్యోగం మానేశాను. అలాగని ఖాళీగా కూర్చునే మనస్తత్వం కాదు నాది! ఏదో ఒకటి చేయాలి అనుకునేదాన్ని. ఏదో ఎందుకు… నా చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ఇదే మంచి సమయం అనిపించింది. ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని బలంగా ఫిక్సయ్యాను. ఆ మాట మొదట అమ్మకే చెప్పాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)లో శిక్షణ తీసుకుంటే మంచిదని అమ్మ సలహా చెప్పింది. మా ఆయన విష్ణువర్ధన్ నన్ను ప్రోత్సహించారు. ఐఐఎంఆర్ మిల్లెట్ స్టార్టప్ ఇంకుబేషన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ మిల్లెట్స్ గురించి, వాటితో వ్యాపార అవకాశాల గురించి, వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలో నేర్చుకున్నాను.
వంటగదే ప్రయోగశాల
ఈ ప్రయత్నాల్లో ఉండగానే కొవిడ్ వచ్చింది. లాక్డౌన్ అమలైంది. అప్పుడు ఎల్బీ నగర్ దగ్గర్లోని అలకాపురిలో ఉండేవాళ్లం. ఇంట్లోనే ఉంటూ జొన్నలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు, సజ్జలు, పప్పులతో రకరకాల పిండి వంటకాలను తయారు చేయడం మొదలుపెట్టాను. ఎదిగే పిల్లలకు ప్రొటీన్లు, పనిచేసే పెద్దలకు కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో అందాలి.
పిల్లలు, పెద్దలు, మహిళల ఆరోగ్యాన్ని, అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చిరు ధాన్యాలు, పప్పులు ఉపయోగించి రకరకాల స్నాక్స్ (చిరుతిళ్లు) తయారు చేశాం. మేం తయారు చేసినవి శరీర అవసరాలు తీర్చేందుకు సరిపోతాయో? లేదో? తెలుసుకునేందుకు ల్యాబొరేటరీకి పంపించేవాళ్లం. అక్కడి టెస్టుల తర్వాత వచ్చిన రిపోర్టుల ఆధారంగా మళ్లీ మార్పులు చేసి టెస్ట్ చేయించేవాళ్లం. అనుకున్నట్లుగా పోషకాల లెక్క కుదిరాక.. అదే పద్ధతిలో స్నాక్స్ తయారు చేయడం మొదలుపెట్టాం. ఇలా చిరుధాన్యాలతో అభివృద్ధి చేసుకున్న ఏడు రకాల స్నాక్స్ రూపొందించాను.
కొత్త ప్యాకుల్లో పాత రుచులు
మార్కెట్లో ఆహార పదార్థాలకు మంచి డిమాండే ఉంది. కానీ, పోటీ కూడా అంతే తీవ్రంగా ఉందనిపించింది. పెట్టుబడి కూడా ఎక్కువే కావాలి. మా అమ్మ, మా ఆయన ఏడు లక్షల రూపాయలు నా చేతికి ఇచ్చారు. ఇంట్లోనే చిన్న పిండి గిర్నీ పెట్టుకుని, వంట సామాగ్రి, ప్యాకింగ్ మెషిన్ కొని తయారీకి సిద్ధమయ్యాను. స్నాక్స్ కోసం ఓ వంట మనిషిని నియ
మించుకున్నాను. అమ్మా, నేను కలిసి పని మొదలుపెట్టాం. ‘ఏన్షియంట్ ఫుడ్స్’ పేరుతో ఇంటికి దగ్గర్లో స్టోర్ ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఏడు రకాల ఉత్పత్తులూ భలేగా అమ్ముడయ్యాయి. ఇంతలో కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. జనం భయం భయంగా బతుకుతున్న రోజులవి. ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నారు. కరోనా నుంచి బయటపడాలంటే పోషకాహారం తినాలనే స్పృహ బాగా పెరిగింది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మేం ఉత్పత్తిని పెంచాం. గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్లి స్టాల్స్ పెట్టాం. బాగా ఆదరించారు. మా స్నాక్స్ ఒకసారి తీసుకున్నవాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. అందువల్లే మార్కెట్లో నిలబడగలిగాం. ఎక్కువమంది ఉద్యోగులు ఉండే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అనుమతి తీసుకుని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం.
ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభిస్తున్నది. రోజులు గడిచే కొద్దీ వ్యాపారం సజావుగా సాగుతున్నది.
పాతకాలపు రచులు, సంప్రదాయ పద్ధతుల్లో వంటకాలు, చిరుతిళ్లను అందించే మా ఆలోచన ప్రజల్ని ఎలా ఆకట్టుకుందో పెద్దపెద్ద సంస్థల్ని కూడా ఆకర్షించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థలు ‘టాప్ 100 సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టార్టప్’లలో ఒకటిగా గుర్తింపునిచ్చాయి. ఈ గుర్తింపు మా బాధ్యతను మరింత పెంచింది. ఇంకొంత రుచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే పట్టుదలనిచ్చింది.
ఆరోగ్యమే మహాలాభం
ఆహార రంగంలో వ్యాపార అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో కావాలని అడుగుతున్నారు. పెద్ద మొత్తంలో ఉత్పత్తి, డెలివరీకి మా సామర్థ్యం సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో విస్తరించాలనుకున్నాను. పీఎంఈజీ పథకం ద్వారా రూ.23 లక్షల ఆర్థిక సాయం అందింది. ఈ మొత్తంతో తయారీ కేంద్రాన్ని మరోచోటికి మార్చాను. విశాలమైన వంటశాల, ఆఫీస్, స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాను. మేకింగ్ మెషినరీ, ప్యాకింగ్ మెషినరీ కొన్నాను. పనివాళ్లను పెంచాను.
ఏడు రకాల స్నాక్స్తో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు 70 రకాల ఉత్పత్తులకు చేరింది. స్నాక్స్, లడ్డూలు, రెడీ టు కుక్ మిల్లెట్ పౌడర్స్, పచ్చళ్లు తయారు చేస్తున్నాం. పూసలు, బిస్కెట్లు, స్నాక్స్, లడ్డూలను చిరు ధాన్యాలతోనే తయారు చేస్తాం. వీటి తయారీకి చెక్క గానుగ నూనెలు మాత్రమే వాడుతున్నాం. ప్రచార వ్యయం లేకుండానే పోటీ మార్కెట్లో నిలదొక్కుకున్నాం. జొన్న, రాగులు, కొర్రలు, అండ కొర్రలతో తయారు చేసిన మురుకులు, బూందీ, మిక్చర్, పూసలు ఎక్కువగా కొంటున్నారు. తియ్యటి పదార్థాలు ఇష్టపడే పిల్లల కోసం రాగి లడ్డూ, జొన్న లడ్డూ, సజ్జ లడ్డూ చేస్తున్నాం. పోషకాహార లోపాన్ని సరిదిద్దేలా చిరు ధాన్యాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ కలిపి పొడులు తయారు చేస్తున్నాం.
…? నాగవర్ధన్ రాయల
– భాస్కర్