మనదేశంలో చాలామంది దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా డాక్టర్ను కలుస్తారు. కానీ, కళ్ల విషయానికి వచ్చేసరికి పట్టించుకోనట్టే వ్యవహరిస్తారు. తలనొప్పి వస్తున్నా, కళ్ల నుంచి నీరు కారుతున్నా.. నిద్రలేమి వల్లనో, ఫోన్ వాడటం వల్లేనేమో అనుకుంటారు. సమస్య తీవ్రమయ్యేదాకా వైద్యుడి దగ్గరికి వెళ్లరు. కానీ, ఇలాంటి అజాగ్రత్త.. కంటిచూపుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్నవారు కంటి సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. అదుపు చేయలేని మధుమేహం వల్ల.. శరీరంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఆ ప్రభావం కంటిలోని అతిసూక్ష్మ నరాలపైనా పడుతుంది. దాంతో కంటిలోని రెటీనాకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా కంటిలో ఒత్తిడి పెరిగి.. గ్లకోమాకు దారితీస్తుంది. కొన్నిసార్లు ‘ఓపెన్ యాంగిల్ గ్లకోమా’ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ సమస్య వచ్చినట్లయితే.. ప్రారంభంలో లక్షణాలు పెద్దగా బయటపడవు. సమస్య ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. చూపు మసకబారడం, కంటిలో తీవ్రమైన నొప్పి, లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు లాంటి రంగులు కనిపించడం, వాంతులు, వికారం లాంటివి బాధిస్తాయి. పట్టించుకోకపోతే.. చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. కళ్లను కాపాడుకోవచ్చు. ఇందుకోసం రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకుంటే.. కళ్లలోని రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి.