శ్రీధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెండ్లై మూడు నెలలైంది. ఇంతలోనే విడాకులు కావాలంటూ పోరు. విదేశాల్లో స్థిరపడటానికి అమ్మాయికి ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. ఇక్కడ చేసే జీతం సరిపోవడం లేదని విదేశాలకు వెళ్లి స్థిరపడుదామని భార్యతో గొడవ. ఇక్కడే ఉండి ఉన్నంతలో జీవిద్దామని ఆమె అంటుండటంతో విడాకులు అడుగుతున్నాడు.
ఆమె పేరు శిరీష. ఆదిలాబాద్వాసి. 26 ఏండ్లు. పెండ్లై నాలుగు నెలలైంది. ఆమె తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చి హైదరాబాద్కు చెందిన కుర్రాడితో వివాహం చేశారు. కొత్త కాపురానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కానీ వివాహం జరిగిన నెల రోజుల నుంచే దంపతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అది సైకాలజిస్టు వద్దకు వెళ్లింది. కారణం ఏంటని ఆరాతీస్తే.. అమ్మాయికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని తేలింది. ఇతరులకు సొంతంగా మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటి అద్దె వేలల్లో వస్తుంది. మనకు ఒకటే ఇల్లు ఉంది. మనం కూడా అలానే అపార్ట్మెంట్లు కడుదాం. ఊరిలో ఉన్న భూములు అమ్మేద్దామంటూ ప్రతిరోజు భర్తతో గొడవ.
పెండ్లంటే నూరేండ్ల పంట అని కొందరు.. కాదు మంట అని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయం వారిది. కానీ అర్థం చేసుకునే దంపతులకు మాత్రం నిత్యం పంటే అని ఇంకొందరి మాట. అయితే ఈ గమనంలో భార్యాభర్తలు ఓపికతో ఉండాల్సిందేనని అంటున్నారు. అప్పుడే దాంపత్యం మాధుర్యం తెలుస్తుందని సూచిస్తున్నారు. సంసారమనే బండి సజావుగా నడవాలంటే ఓపిక ఉండాల్సిందేనని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంటల్లో అంచనాలు చిచ్చు రేపుతున్నాయి. అనేక ఆలోచనలతో ఒక్కటవుతున్న వారు తీరా అవి నెరవేరకపోవడంతో విడాకుల వరకు వెళ్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో వివాహం చేసుకున్న జంటల్లో ఈ సమస్య అధికంగా ఉందని వారు వివరిస్తున్నారు.
చాలా మంది దంపతులు చిన్న చిన్న కారణాలు, అనేక అనుమానాలతో తమ దాంపత్య జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు. ఇంకొందరు విడాకుల వరకు వెళ్తున్నారని.. కరోనా పరిస్థితులు వివాహ బంధాలకు గండి కొడుతున్నాయని పలువురు సైకాలజిస్టులు సూచిస్తున్నారు. హనీమూన్ ట్రిప్స్, ఆలయాల దర్శనం, బంధువుల ఇంటికి వెళ్లి గడపడం ఇలాంటి చిన్న చిన్న సరదాలకు దూరం చేశాయని అంటున్నారు. అయితే కొత్త జంటలు ఎంతో ఓపికతో ఉండాలని.. సరదాలు తీర్చుకునే ప్లాన్ చేసుకోవాలని.. ఓ వేళ కుదరకపోయినా సర్ధి చెప్పుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.