ప్రకృతి పచ్చగా ఉంటే మానవజాతి చల్లగా ఉంటుంది. ఈ సందేశం ప్రముఖుల ద్వారావెళితేనే చాలామందికి చేరుతుంది. అందుకు చిత్రలేఖనాన్ని సాధనంగా చేసుకున్నారు కొడవలూరు ప్రసన్న.‘సేవ్ ట్రీస్’ పేరుతో ఆమె నిర్వహిస్తున్న ప్రచారం ఎంతోమంది మన్ననలు అందుకుంటున్నది.
వృక్షోరక్షతి రక్షితః. మనం బతుకుతూ ప్రకృతినీ బతకనిస్తేనే మనకూ, మన ముందు తరాలకూ మనుగడ. ఆ పచ్చని లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి నాలుగేండ్ల క్రితం ‘సేవ్ ట్రీస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొడవలూరు ప్రసన్న. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు అమిత ఆసక్తి ఉన్న చిత్రలేఖనాన్ని మార్గంగా ఎంచుకుంది. తమ ప్రాంతంలోని గండికోట మట్టిని రంగుల్లో కలిపి రకరకాల వర్ణ చిత్రాలు గీస్తుంది తను. ప్రముఖుల పటాలనూ అచ్చెరువొందేలా చిత్రిస్తుంది. ఈ పెయింటింగ్స్ అన్నిటిలోనూ ‘చెట్లను రక్షిద్దాం’ అనే నినాదం జోడిస్తుంది.
ఆ చిత్రాలను సినీ, రాజకీయ ప్రముఖులకు కానుకగా అందిస్తుంది. వాళ్లతో చెట్ల గురించి నాలుగు మంచి మాటలు చెప్పించి.. చివర్లో ఆటోగ్రాఫ్ తీసుకుని తన ఫేస్బుక్, ఇన్స్టాల్లో పోస్ట్ చేస్తుంది. తద్వారా ఆయా సెలెబ్రిటీల అభిమానులకు పచ్చదనం పట్ల ఆసక్తి కలిగించవచ్చని ఆమె ఆలోచన. చిత్రకారుడు తుపాకుల రామాంజనేయ రెడ్డి దగ్గర ఐదేళ్లు తర్ఫీదు పొందింది ప్రసన్న. ఇప్పటి దాకా ఎనిమిది మంది గవర్నర్లు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఎందరో ప్రముఖులను కలిసింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్కూ తన ప్రచారం గురించి వివరించింది. వందకు పైగా చిత్రాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. ‘పచ్చని చెట్లంటే ప్రాణం పెట్టేవాళ్లు నా క్యాంపెయిన్ను ప్రారంభిస్తే అది తిరుగులేని విజయం సాధిస్తుందన్నది నా ఉద్దేశం. అందుకే ఎన్నో చెట్లను పెంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సాలుమరద తిమ్మక్కతో నా కార్యక్రమ లోగోను ఆవిష్కరింపజేశాను. చెట్ల పెంపకం మీద అవగాహన కల్పించడమే కాదు, మున్ముందు కూడా ఎన్నో మొక్కలు నాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను’ అని చెబుతున్నదామె.