వందన అందరిలాంటి అమ్మాయే! బాగా చదువుకోవాలనుకుంది. అమెరికా వెళ్లాలని కలలు కన్నది. కానీ, తండ్రి స్నేహితుడి బుద్ధి గడ్డి తిని ఆమె చదువును ఆపేసింది. లేని పిచ్చిని అంటగట్టింది. ఏండ్లకేండ్లు ఏడ్చింది. తనలో తాను కుమిలి పోయింది. ఓ యోగి పరిచయం ఆమెను మనిషిని చేసింది. కృష్ణ తత్వం ఆమెను మనీషిగా మార్చింది. కృష్ణుడి సేవలో నిరంతరం అనంతమైన ఆనందాన్ని పొందుతున్నానని చెబుతున్నది వందన ఖైతాన్. ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించి తను అనుభవించిన కృష్ణ ప్రేమను అందరికీ పంచుతున్నది. ‘వందే కృష్ణ’ ఫౌండేషన్ ద్వారా ప్రణవాక్షరి పవిత్రతను, కృష్ణలీలామృతాన్ని చాటిచెబుతున్నది. సినిమాలు, కీర్తన క్లబ్బులు, యూ ట్యూబ్ సిరీస్లతో ఆధ్యాత్మికతను కొత్తపుంతలు తొక్కిస్తున్న ఈ అభినవ యోగిని అంతరంగం ఆమె మాటల్లో…
అప్పుడు నా వయసు 17 ఏండ్లు. ఢిల్లీలో ఉండేవాళ్లం. అప్పటి వరకు హాయిగా సాగిన జీవితంలో ఓ కల్లోలం రేగింది. తాతయ్య వయసున్న ఓ వ్యక్తి నన్ను బలాత్కరించబోయాడు. 65 ఏండ్ల ఆ వైద్యుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్. చనువుగా ఉంటే తాతలా ఆదరిస్తున్నాడు అనుకున్నా! కానీ, నాపై పైశాచిక దాడికి ప్రయత్నించాడు. అరిచాను.. వదల్లేదు. తీవ్రంగా ప్రతిఘటించాను నాపై పగ పెంచుకున్నాడు. జరిగింది అమ్మానాన్నలకు చెప్పేలోపే.. నాపై వాళ్లకు లేనిపోనివి నూరిపోశాడు. నాది చంచల మనస్తత్వమనీ, మానసిక చికిత్స అవసరమనీ వారిని నమ్మించాడు.
అప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. అనుకున్నన్ని మార్కులు సాధించలేకపోయాను. ఆ ఆవేదనలో ఉండగానే.. ఈ సంఘటన నన్ను మరింత కుంగదీసింది. స్కూల్డేస్లో నేను టాప్ స్టూడెంట్ని. అమెరికా వెళ్లి చదువుకోవాలని నా ఆశ. కానీ, ఈ పరిణామాలతో నాన్న నో అన్నాడు. పెండ్లి చేయాలని అనుకున్నాడు. అందుకు ఎదురు తిరిగాను. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అమెరికాలో హయ్యర్ స్టడీస్కు దరఖాస్తు చేశాను. కానీ, సీటు రాకపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నా!
పదిహేనేండ్లు పిచ్చిదానిలా..
రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. ఆ ముదుసలి నన్ను మెసలకుండా కుట్రలు చేశాడు. నాకు పిచ్చి పట్టిందని అమ్మానాన్నలను నమ్మించాడు. ఓ మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి యాంటీ డిప్రెషన్ మందులు ఇప్పించాడు. చాలాకాలం తర్వాత గానీ, అతను మోసగాడని మా అమ్మానాన్నకు అర్థం కాలేదు. అప్పటికే నేనెంతో కోల్పోయాను.
యాంటీ డిప్రెషన్ మందులతో ఆరోగ్యమూ దెబ్బతిన్నది. లేని రోగాన్ని సృష్టించి, లేనిపోని మందులిచ్చి పదిహేనేండ్లు నన్ను పిచ్చిదాన్ని చేశారంతా! ఈ పరిస్థితుల్లో ఓ రోజు రిషికేశ్లో యోగి ప్రొటోప్లాస్మ్ని కలిశాను. పేరు చిత్రంగా ఉందే అనుకున్నా! ఆయనకు నేను ఏదో చెప్పబోతుంటే ఆపి.. ‘నీ సమస్య మూలాలు ఏదో ఒక రోజు నశించే నీ దేహంలో ఉన్నాయి. నశించిపోయే దేహాన్ని బాగు చేయడం బదులు… ఎన్నటికీ నశించని ఆత్మ గురించి తెలుసుకో! అన్నీ సర్దుకుంటాయి’ అన్నారు. ‘ఓం’కారం ఉచ్ఛరించమని ప్రణవం ఉపదేశించారు. సాధన చేయమని ఏవో మంత్రాలు చెప్పారు. రోజుల వ్యవధిలోనే నా మనసు కొంత ప్రశాంతత పొందింది. టీనేజ్లో వైరాగ్యాన్ని అనుభవించిన నేను చివరికి భక్తి మార్గంలోకి వచ్చాను.
వందే కృష్ణ
గురూజీ మార్గదర్శకత్వంలో నా జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఒత్తిడి తొలగిపోయింది. మనసుకూ సత్తువ వచ్చింది. ఇప్పుడు నా వయసు 54 ఏండ్లు. నేను ట్యాబ్లెట్ వేసుకొని దాదాపు 22 ఏండ్లు గడిచిపోయాయి. పూర్తిగా శ్రీకృష్ణుడి ఆరాధకురాలిగా మారాను. సగుణ ఆరాధన నుంచి నిర్గుణ ఉపాసనకు చేరుకున్నాను. కృష్ణుడి కీర్తనలకు నృత్యం చేస్తూ బ్రహ్మానందాన్ని పొందుతున్నాను. ‘ఓం’కారం మోక్షసాధన మంత్రం మాత్రమే కాదు, దానికి మనసును స్వస్థపరిచే శక్తి ఉంది. నేను పొందిన జ్ఞానాన్ని, అధ్యాత్మ సాధనలో అనుభవించిన ఆనందాల్ని ప్రాచుర్యంలోకి తేవాలని ‘వందే కృష్ణ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాను. కృష్ణుడు నడయాడిన బృందావనం కేంద్రంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భక్తి ప్రచారం నిర్వహిస్తున్నాం. కృష్ణ తత్వాన్ని పదిమందికీ చేరువ చేస్తున్నాం. వేదాంత సారాన్ని చాటిచెబుతున్నాం.
వినోదంలో ప్రబోధం
మీడియా చాలా ప్రభావవంతమైనది. అందుకే సందేశాత్మక, వినోదాత్మక సినిమాలు నిర్మించాలని భావించాను. వినోదంతోపాటు ప్రబోధం ఉండేలా ప్రయోగం చేశాం. ధ్యానం ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘మమ్’ చిత్రం రూపొందించాం. మా గురువుగారికి మార్గదర్శకులైన రమణ మహర్షి, యోగి రామా జీవితాలను తెలిపే డాక్యుమెంటరీలు నిర్మించాను. ‘యోగీ వర్సెస్ భోగి’ పేరుతో ఆధ్యాత్మిక భావాలను తెలియజేసే యూట్యూబ్ సిరీస్ రూపొందించాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాయకుడు సిద్ధార్థ మోహన్, కిరణ్ బేడి నటించారు. దీనిని సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సినిమాలపై, ధ్యానంపై వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. ఇందులో ‘ప్రణవ నాద అనుసాధన’తోపాటు ఓంకారాన్ని ఆరు దశల్లో పలకడం సాధన చేయిస్తున్నాం. మా గురువుగారి ఆధ్యాత్మిక భావాలను విశ్వవ్యాప్తం చేయాలన్నది నా కల. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను.
కీర్తన బార్
యువతను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించాలంటే ప్రవచనాలు చెప్తానంటే కుదరదు. కొత్తపంథాను ఎంచుకుంటేనే వారు మనల్ని అనుసరిస్తారు. అందుకోసం సైంటిఫిక్ స్పిరిచ్యువల్ స్పా (శాస్త్రీయ ఆధ్యాత్మిక కేంద్రం) ఏర్పాటు చేశాం. ఇక్కడ ఆధునికతకు కొదువ ఉండదు. దేహం, మనసు, ఆత్మను స్వస్థపరచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కీర్తన బార్లను నెలకొల్పాం. రాక్ పాటలు డీజేలో వింటే కుర్రకారు హుషారు వేరుగా ఉంటుంది. కీర్తనలను కూడా అలాగే వినిపిస్తున్నాం. దీంతో యువత మా కీర్తన బార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వారాంతాల్లో వస్తున్నారు. ఆడుతూపాడుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని తెలుసుకుంటున్నారు. ఇలా ఉల్లాసభరితమైన వాతావరణంలో భక్తి తత్వాన్ని బోధిస్తున్నాం. ఉన్నత విలువలతో సినిమాలు నిర్మించి ఆధ్యాత్మిక భావాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే వందే కృష్ణ ఫౌండేషన్ లక్ష్యం.
ఆధ్యాత్మిక టీకా
సమాజంలో పేరుకుపోయిన అవినీతి, స్వార్థాలను రూపుమాపే శక్తి ఆధ్యాత్మికతకు ఉంది. రోగాలు రాకుండా టీకాలు ఎలా ఇస్తున్నామో, ప్రతి మనిషికీ ఆధ్యాత్మిక వ్యాక్సినేషన్ చేయాలి. ‘గర్భ సంస్కార్’ కార్యక్రమం చేపడుతున్నాం. ఆత్మజ్ఞానం పట్ల పిల్లలకు అవగాహన కలగాలంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆమెను ఆధ్యాత్మికత దిశగా నడిపించాలి.