ప్రకృతితో మమేకమై పండుగలు చేసుకోవడం మన భారతీయ సంప్రదాయం. వినాయక చవితి సైతం పూర్తిగా ప్రకృతిని ఆరాధించే పండుగ. స్వామిని పూజించేందుకు వినియోగించే పత్రి, పువ్వులు అన్నీ ప్రకృతి సిద్ధమైనవే! ఇదే క్రమంలో వినాయకుడి ప్రతిమను కూడా మట్టిదే ప్రతిష్ఠించి, పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలను వినియోగించి, ప్లాస్టిక్ పూలు, దండలతో పూజించి చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేస్తే జలవనరులు కలుషితం అవుతాయి. దీనిని దిద్దుకోకపోతే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీం కోర్టు సైతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జలవనరులను కలుషితం చేయొద్దని తీర్పు వెలువరించింది. మట్టి విగ్రహాలను పూజించాలని, పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆయన ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా లక్షల మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్ సైతం ఏటా వేలాది విత్తన గణపతులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నది. వాటిని భూమిలో నిమజ్జనం చేస్తే మొక్కలు ఎదుగుతున్నాయి. అటు పర్యావరణ హితంతోపాటు ఇటు పచ్చదనం పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తున్నది. ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజిద్దాం. పర్యావరణ సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుదాం. విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుదాం.
– జోగినపల్లి సంతోష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు