నలభీములు చేసిన పాకమే అయినా చిటికెడంత ఉప్పు తక్కువైతే రుచించదు. అలాగని కూరల్లో తక్కువైందని పై ఉప్పు వేసుకుంటే ప్రమాదమని హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. ఎక్కువైతే ముద్ద నోట్లోకి దిగదు. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చిందే ఈ ఎలక్ట్రిక్ స్పూన్. ‘కిరిన్ హోల్డింగ్స్’ అనే జపనీస్ డ్రింక్స్ సంస్థ దీనిని డిజైన్ చేసింది. ఈ చెంచాతో తింటే.. పదార్థంలో ఉప్పు ఎక్కువ తక్కువలున్నా.. దాన్ని రుచికరంగా మార్చేయడమే దీని ప్రత్యేకత.
ఈ సాంకేతిక పరిశోధనకు గానూ ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఉప్పు తప్పులను ఒప్పు చేసే కిరిన్ ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్లకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నెలలో 200 చెంచాల ధర 19,800 యెన్లు పలికాయి. రానున్న జూన్ నుంచి ఆఫ్లైన్లోనూ ఈ స్పూన్లు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రకటించింది. ఐదేండ్లలో పదిలక్షల మంది ఈ సాల్ట్ చెంచాల వినియోగదారులను కలిగి ఉండటమే తమ లక్ష్యమని కిరిన్ హోల్డింగ్స్ ప్రకటించింది.
ప్లాస్టిక్, మెటల్ వెరైటీలతో రూపొందిన ఈ చెంచాను మీజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హోమీ మియాషితా అభివృద్ధి చేశారు. నాలుకపై సోడియం అణువులను కేంద్రీకరించడానికి ఈ ఎలక్ట్రిక్ చెంచా నుంచి తేలికపాటి విద్యుచ్ఛక్తి విడుదలై ఆహారం రుచి ఉప్పుగా మారుతుందట. ఈ చెంచా బరువు 60 గ్రాములు. రీచార్జ్ చేయడానికి అనువుగా ఉండే లిథియం బ్యాటరీ సాయంతో ఇది పని చేస్తుంది.