వేదాలకు చిక్కనివాడు. ఉపనిషత్తులకు అందనివాడు. పురాణాలకు పూర్తిగా గోచరించనివాడు. అనేకానేక పరీక్షల తర్వాత కానీ మునిగణాలకు ముక్తిని ఇవ్వనివాడు.. యశోదాదేవి రోటికి మాత్రం ఇట్టే చిక్కిపోయాడు. ఆ రోలు అమ్మ ప్రేమకు ప్రతీక. ముద్దుగారే శిశువును యశోదమ్మ పెంచి పెద్దచేసిన తీరు ప్రతి తల్లికీ పేరెంటింగ్ పాఠం.
అంతులేని ప్రేమ, అంతలోనే క్రమశిక్షణ.. యశోదమ్మ పెంపకంలోని ప్రత్యేకత. జగత్తుకే తండ్రిని తన బిడ్డ అనుకుంది. గంగా జనకుడికి లాల పోసింది. సృష్టిపాలకుడికి దిష్టి తీసింది. యదుకుల తిలకుడికి తిలకం దిద్దింది.
ముల్లోకాల మూలమూర్తికి మొలతాడు కట్టింది. సూర్యచంద్రులు నేత్రద్వయమైన వాడితో దాగుడుమూతలు ఆడింది. ‘బూచోడికి పట్టిస్తా’ అంటూ అసుర సంహారిని భయ పెట్టింది. క్షీర సంద్రంలో పవ్వళించే స్వామికి పాలబువ్వ తినిపించింది. జగద్రక్షకుడికి రక్ష రేఖ కట్టింది. ఆ ముద్దులూ మురిపాలూ ఎక్కడా హద్దులు దాటలేదు. బిడ్డ వ్యక్తిత్వ నిర్మాణానికి అవరోధమూ కాలేదు. ఆమె పెనిమిటి నందగోపుడు రేపల్లె గ్రామపెద్ద, కంస చక్రవర్తి సామంతుడు. అయినా.. యశోదమ్మకు అణువంతైనా అహంకారం లేదు. ఆ నిరాడంబరత్వాన్నే కృష్ణుడికీ నేర్పింది.
స్నేహం.. కృష్ణతత్వం
తల్లిదండ్రులు తమ పిల్లలకు స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ‘కాలనీ వాళ్లతోనే మాట్లాడు. బస్తీ జనానికి దూరంగా ఉండు’ తరహా పరిమితులు పెట్టకూడదు. యశోదమ్మ కూడా ఆ ఆంక్షలకు అతీతమే. కాబట్టే, కృష్ణుడి మిత్రబృందంలో కుచేలుడిలాంటి నిరుపేదలు ఉన్నారు. ఉద్ధవుడి లాంటి సామాన్యులూ ఉన్నారు. కుచేలుడికి సంపదలనూ, ఉద్ధవుడికి జ్ఞాన సంపదనూ ఇచ్చిన స్నేహశీలి కన్నయ్య. బలరామకృష్ణులు.. అక్షరజ్ఞానం లేని గోప బాలకులతో ఆడుకున్నారు, పాడుకున్నారు.
కలిసి సద్దులు ఆరగించారు. పంచుకోవడంలోని ఆనందాన్ని అలా తెలుసుకున్నారు. ఆ అనుభవం ద్వారకాధిపతి హోదాలో శ్రీకృష్ణ సార్వభౌముడికి బాగా పనికొచ్చింది. మాయాజూదంలో అన్నీ కోల్పోయిన పాండవులతో రాజ్యాన్ని పంచుకోమంటూ కౌరవులకు హితవు చెప్పగలిగాడు. పంచేదిలేదని మొండికేసిన వంచకులను కురుక్షేత్ర యుద్ధంలో ఓడించ గలిగాడు. ధర్మాన్ని స్థాపించగలిగాడు.
ప్రపంచమే పాఠశాల..
కృష్ణుడి రేపల్లె జీవితం అనేక అనుభవాల సమాహారం. తనకు తీయని గుమ్మపాల రుచి తెలుసు. పూతన చన్నుల చేదూ తెలుసు. ‘అకటా..’ అనిపించేంత అల్లరి చేశాడు. శకటాసురుడనే రాక్షసుడినీ సంహరించాడు. కొంగరూపంలో దొంగదెబ్బ తీయాలని చూసిన బకాసురుడి కుట్రనూ వమ్ము చేశాడు. ఆ బాలారిష్టాలు యశోదమ్మ మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదు. కాబట్టే బిడ్డను ధైర్యంగా పశుపాలనకు పంపింది. కొండలూ గుట్టలూ ఎక్కనిచ్చింది. ఏటిలో, నీటిలో ఆడనిచ్చింది. ఎక్కడా పరిమితులు లేవు. కఠిన ఆంక్షలూ లేవు. కాబట్టే, ఆ బిడ్డలోని సహజ నాయకత్వం బయటికొచ్చింది. ప్రతిభాపాటవాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి.
వేలితో కొండనెత్తి.. గోసంపదకు గొడుగులా పట్టి.. గోవిందుడు అయ్యాడు. బ్రహ్మదేవుడి మాయ వల్ల.. తోటి కాపరుల ఆవులు మాయమైనప్పుడు.. ఇతరుల కష్టమూ తనదే అనుకున్నాడు. ‘కంగారుపడకండి. ఆవులు ఎక్కడికీ పోవు. వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది’ అని గోపాలకులకు ధైర్యం చెప్పాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఓ దశలో తాళవనంలో తియ్యని తాటిపళ్లు తినాలని ఉందంటూ.. సాయం కోరిన స్నేహితుల కోసం శ్రీకృష్ణ బలరాములు ధేనుకాసురుడనే అసుర గార్దభాన్ని పరుగులు పెట్టించారు. కాళీయ మర్దన ఘట్టంలో కాళింది మడుగులోని విష సర్పం దర్పమణచి.. జల కాలుష్యాన్ని పరిహరించాడు చిన్ని కృష్ణుడు. ఇక, కార్చిచ్చు నుంచి గోవులను ఎన్నిసార్లు రక్షించాడో. ఇదంతా యశోదమ్మ పెంపకంలోని గొప్పదనమే. ‘ఎవరి సంగతో నీకెందుకు బిడ్డా?’ అని ఏనాడూ నిరుత్సాహపరచలేదు ఆ తల్లి.
ఆటపాటలు..
పిల్లలకు అల్లరి ఓ ఆభరణం. ఆటల వల్ల వ్యాయామం అవుతుంది. ఊబకాయం లాంటి సమస్యలు రానేరావు. జీవన నైపుణ్యాలూ తెలుస్తాయి. మనుషులతో మెలగడం అర్థం అవుతుంది. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. సామాజిక జీవన సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. గాయాల భయంతోనో, తగాదాల తలనొప్పులతోనో అమ్మలు ఆటలకు అడ్డు చెప్పకూడదు. అలా చేయడం బాల్యాన్ని అవమానించడమే. బిడ్డ మనోవికాసాన్ని నిరోధించడమే.యశోదమ్మ కూడా కృష్ణుడి ఆటపాటలను ఏనాడూ నిరుత్సాహపరచలేదు. అలా అని, అవసరమైనప్పుడు, అవసరమైనంత మేర మందలించడమూ మరిచిపోలేదు. మన్ను తిన్నప్పుడు మిన్నకుండలేదు. ‘అన్నన్నా.. ఇంత పనిచేస్తావా?’ అంటూ కన్నెర్రజేసింది.
కృష్ణుడి మిత్రబృందంలో అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ ఉన్నారు. ఆ స్నేహాన్ని యశోదమ్మ సందేహించలేదు. కాబట్టే, శ్రీకృష్ణుడు స్త్రీజనోద్ధారకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కుబ్జలో హృదయ సౌందర్యాన్ని దర్శించాడు. ద్రౌపది కష్టాన్ని గ్రహించి.. నిండు సభలో ఆమె గౌరవాన్ని నిలబెట్టాడు. సోదరి సుభద్ర మనుసు అర్థం చేసుకుని అర్జునుడికిచ్చి పెండ్లి చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించి.. మేనత్త కుంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంతటి ఉత్తమ సంస్కారానికి ఇల్లే పునాది. సమర్థుడైన పాలకుడిగా, సర్వోత్తమ రాజనీతిజ్ఞుడిగా, ధర్మ రక్షకుడిగా.. శ్రీకృష్ణచంద్రుడి పరిపూర్ణ వ్యక్తిత్వానికి మూలాలు యశోదమ్మ పెంపకంలోనే ఉన్నాయి. ఆ మాటకొస్తే.. రేపల్లెలోని ప్రతి అమ్మకూ ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే, బిడ్డ పెంపకంలో ఊరు ఊరంతా పాలుపంచుకుంటుంది. యశోదమ్మ స్ఫూర్తితో మన బిడ్డలనూ అంతే స్వేచ్ఛగా ఎదగనిద్దాం. శ్రీకృష్ణుడు అంతటివాళ్లుగా తీర్చిదిద్దుదాం.