ఆమె తండ్రి వ్యాపారి. ఢిల్లీ కేంద్రంగా పెద్దపెద్ద దవాఖానలకు దుప్పట్లు సరఫరా చేసేవారు. తన కూతురు కూడా ఏదో ఒక రోజు తాను సరఫరా చేసే దుప్పట్లనే కప్పుకోవాల్సి వస్తుందని ఆయన కలలోనైనా ఊహించి ఉండరు. నలభై అయిదేండ్ల సెజల్ జొబన్పుత్ర.. కిడ్నీ వైఫల్యంతో పదహారేండ్లుగా మంచం మీదే ఉన్నది. ఆమె తోబుట్టువు మూత్రపిండ దానానికి ముందుకొచ్చింది కానీ, సెజల్ శరీర వ్యవస్థ దాన్ని ఆమోదించలేదు. దీంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స విఫలమైంది. రెండు మూత్రపిండాలూ పనిచేయక పోవడంతో డయాలసిస్ పైనే బతికేస్తున్నది. అయినా సరే, వ్యాధితోనే కాదు.. సమాజంతోనూ యుద్ధం చేస్తున్నది. మూత్రపిండ రోగులకు ఆసరా అందిస్తున్నది. చికిత్సలు, బీమా, అవయవదానం.. తదితర అంశాలపై చైతన్యం కలిగిస్తున్నది. ‘కిడ్నీ వారియర్స్’ ఆమె పోరాట వేదిక. ‘మూత్రపిండ రోగుల బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా డయాలసిస్ ఏర్పాట్లు ఉండాలి’ అన్నది ఆమె డిమాండ్.