Mindful eating | ఇటీవలి కాలంలో చాలామంది అన్నం తినేప్పుడు టీవీ చూస్తున్నారు. చిన్నపిల్లలైతే గ్యాడ్జెట్లో వీడియో పెట్టనిదే ముద్ద ముట్టట్లేదు. పరధ్యానంగా తీసుకునే ఆహారం ఒంటికి పట్టదని చెబుతారు పెద్దలు. ఇలా టీవీలు చూస్తూ తినడం వల్ల ఏమైనా ఇబ్బందా?
-ఓ పాఠకురాలు
అవును. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వికులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో ‘మైండ్ఫుల్ ఈటింగ్’ అంటున్నారు. అంటే, ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా, టీవీ చూస్తూ తింటే తెరమీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తానూ జరుపుతుంది. దీనివల్ల ఆహారం శోషణ, జీర్ణక్రియకు సంబంధించి పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి.
మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా.. వాటిలో కొన్నిటిని మాత్రమే శరీరం తీసుకోగలదు. మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్లిపోతుంది. అంతేకాదు, జీవక్రియ కూడా మందగిస్తుంది. దాంతో ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనికితోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామనే ధ్యాస ఉండదు. అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి, తినడం పూర్తి అయ్యాక కూడా మంచి భోజనం చేశామనే సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది.
లేదంటే, ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుంది. సాధారణంగా, టీవీ చూసేప్పుడే ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్లాంటివి అధికంగా తీసుకుంటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమ్మల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి, అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి, తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అవుతున్నది.
ఇది మొదటి దశ. ఇక, రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా.. ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కి పోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలా పెద్దవాళ్లూ, పిల్లలూ కలిసి ఒక దగ్గర కూర్చుని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలూ దరిచేరవు. మనం ఏమి ఏంటున్నాం, ఏయే పోషకాలు తీసు కుంటున్నాం.. లాంటి వివరాలు తెలుసుకుని తింటే, మెదడు సరైన సంకేతాలు పంపి, శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానంగా, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com