Inspiration | కాలం ఆమె మీద కత్తి గట్టింది. భర్త మరణించాడు. ఆధారం కరువైంది. మరుక్షణం నుంచీ ఆమె గొంతు మీద పదునైన ఆకలి కత్తి, బాధ్యతల కత్తి.. వేలాడుతూనే ఉన్నాయి. కాలంతో కత్తి యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఆ సమయంలో మొగుడి మంగలి పెట్టె ఆయుధాగారంలా తోచింది. అందులోంచి కత్తి బయటికి తీసింది. ఆత్మవిశ్వాసంతో సానబెట్టింది. ఓ కర్మయోగినిలా క్షౌరకర్మలకు బయల్దేరింది.. మహారాష్ట్రకుచెందిన శాంతాబాయి యాదవ్.
తరాలుగా పురుషాధిక్యం రాజ్యమేలుతున్న క్షురక వృత్తిలో.. నాలుగు దశాబ్దాలుగా తన ఉనికిని చాటుకుంటున్నది శాంతాబాయి. తొలి రోజుల్లో, ఆమె ఉపాధికి కత్తెర వేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. తాను మాత్రం ఏం చేయగలదు పాపం? భర్త చనిపోయాడు. ఉండటానికి ఇల్లు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆదుకునే మనుషుల్లేరు. నలుగురు పిల్లలను పోషించి తీరాల్సిన అనివార్య పరిస్థితి.
మోయలేని భారమే. కానీ, ఆమోదించి తీరాల్సిన బాధ్యత. పట్టుదలో, మొండితనమో, ఏటికి ఎదురీదే మనస్తత్వమో.. ఏమైతేనేం చేతిలో మంగలి పెట్టెతో మగాళ్ల ప్రపంచంలో అడుగుపెట్టింది శాంతాబాయి. కాలమూ గిర్రున తిరిగిపోయింది. ప్రస్తుతం ఆమె వయసు అరవై అయిదు. ‘ఇది నా వృత్తి. దేవుడిచ్చిన ఉపాధి. ఎవర్నీ దోచుకోవడం లేదు. ఎవర్నీ మోసం చేయడం లేదు. నేను ఎంచుకున్న పని తప్పు కాదని నా అంతరాత్మ చెప్పింది. ఆ మాట ప్రకారమే నడుచుకుంటున్నా’ అంటారామె.
ఆ పరిస్థితుల్లో..
శాంతాబాయి భర్త శ్రీపతి యాదవ్. అత్తిల్లు అర్దాల్. సోదరులతో గొడవల కారణంగా శ్రీపతి సకుటుంబంగా ఉన్న ఊరు విడిచి వచ్చేశాడు.. బతుకుదెరువు కోసం మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా హింగ్లాజ్ తాలూకా లోని హసూర్ గ్రామానికి వలస వచ్చాడు. ఆ ఊళ్లో క్షురకులు లేకపోవడంతో గ్రామ ప్రజలు ఉండేందుకు స్థలం చూపారు. జీవనోపాధి కల్పించారు. చాలామంది, డబ్బుకు బదులు ధాన్యం ఇచ్చేవారు. భార్యాభర్తలు, నలుగురు కూతుళ్లు.. మొత్తం కుటుంబానికి గింజలే ఆధారం. అనుకోకుండా, శ్రీపతి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. చాలాచోట్ల వైద్యం చేయించారు. కానీ ఫలితం కనిపించలేదు.
శాంతాబాయికి ఏం చేయాలో తోచలేదు. ఆ పల్లెలో కూలి పనులు కూడా కరువే. బతుకుదెరువు గురించి ఆలోచిస్తున్నప్పుడు.. ఎదురుగా భర్త మంగలి పెట్టె కనిపించింది. తనెప్పుడూ క్షవరం చేయలేదు. కానీ,భర్త చేస్తున్నప్పుడు చూసింది. పనిలోని మెలకువలు పెనిమిటి చెప్పగా విన్నది. తనూ చేయగలననే నమ్మకం కలిగింది. అంతలోనే, సమాజం ఏం అనుకుంటుందో అన్న భయం. శాంతాబాయి తండ్రి కూడా క్షవర కళలో సిద్ధహస్తుడే. పసిబిడ్డగా ఉన్నప్పుడు.. నాన్న వేలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లిన అనుభవమూ ఉంది. ఈ విషయంలో పొరుగింటి వృద్ధురాలిని సలహా అడిగింది. ఆమె కూడా ఎంతో ప్రోత్సహించింది. తొలి ప్రయత్నంగా ఆ వయోధికురాలి మనవడి జుట్టు కత్తిరించింది. కత్తెర నెత్తిని తాకుతుంటే చేతులు వణికాయి. ప్రయోగం ఎందుకని శుభ్రంగా గుండు చేసింది. ఆ తర్వాత వృద్ధురాలి వైపు అభ్యర్థనగా చూసింది. ఆమె చిరునవ్వుతో జుట్టు అప్పగించింది.
ఈ సారి బాగానే కుదిరింది. తనకంటూ ఓ దుకాణం లేదు కాబట్టి, ఇంటినే సెలూన్గా మార్చుకుంది. ఆ పెద్దావిడ వీధివీధికీ వెళ్లి.. శాంతాబాయి గురించి చెప్పింది. అలా మొదలైన క్షవర ప్రస్థానం నలభైమూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నడుస్తున్నది. గ్రామస్తులు కూడా మొదట్లో భయపడ్డారు. నమ్మకం కుదిరాక.. నేరుగా వెళ్లడం ప్రారంభించారు. ఇక, శాంతాబాయిని వ్యతిరేకించేవారు అంటారా.. అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అనేక సంస్థలు ఆమె కృషిని గుర్తించాయి. సన్మానాలు, సత్కారాలతో గౌరవించాయి. తన సంపాదనతో శాంతమ్మ నలుగురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. వాళ్లంతా జీవితాల్లో స్థిరపడ్డారు. జనం తనను ‘అక్కా.. శాంతక్కా’ అని ప్రేమగా పిలుస్తారు. గడ్డానికి పదిహేను, క్షవరానికి పాతిక.. శాంతక్క సెలూన్ ధరలు పేదలకూ అందుబాటులో ఉంటాయి. కొంతమంది ధాన్యం రూపంలోనూ ఇస్తారు.
ఇవ్వగలిగే శక్తి లేకపోతే అదీ తీసుకోదామె. ‘ఇది నా ఉపాధి మాత్రమే. వ్యాపారం కాదు. డబ్బు విషయంలో మరీ పట్టుదలగా ఉండను. పేదరికం ఎంత దుర్మార్గమైందో నాకూ తెలుసు. నాకు అన్నం పెట్టే స్తోమత లేకపోవచ్చు. కానీ, ఉచితంగా క్షవరం చేయగలను ’ అంటారామె ఉదారంగా.
ప్రధానితో భేటీ
సాక్షాత్తు ప్రధాని మోదీ ఆమె ఎదురుగా నిలబడ్డారు. ‘శాంతాబాయి జీ ఎలా ఉన్నారు…?’ అని అడిగారు . తలపై కొంగును సవరించుకొని మరాఠీలో ‘కాయ్ నయీ, బరా హై కీ… సాహెబ్!’ ( ఏం లేదు. అంతా క్షేమమే సాహెబ్) అని సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది. శాంతాబాయి జీవన పోరాటం గురించి తెలుసుకున్న ప్రధాని ఆ యోధురాలిని ఎంతో ప్రశంసించారు. చాలాసేపు ముచ్చటించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జరిగిన భేటీ తనకు ఓ జీవితకాల అనుభవమని శాంతాబాయి ఉద్వేగంగా చెప్పారు. రికార్డుల ప్రకారం దేశంలో తొలి మహిళా హెయిర్ డ్రెస్సర్ శాంతాబాయే.
…? పాసికంటి శంకర్