గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. గొంతు గరగర, గొంతులో నొప్పి, గొంతు మంట లాంటి సమస్యలు ఒకేసారిగానీ, ఒక్కొక్కటి ఒక్కోసారి గానీ కనిపిస్తూ ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. వేరే కాలాల్లోనూ కొంతమందికి కొంచెం చల్లటి నీళ్లు తాగినా, ఏదైనా చల్లటి పదార్థం తిన్నా వెంటనే గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఈ గొంతు సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి పనిచేసే ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
చిట్కా: ఏదైనా ఒక వంట పాత్రలో పావు లీటర్ నీళ్లు పోసి ఆ పాత్రను పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత అందులో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, పదివరకు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ మరిగించిన నీటిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. ఈ చిట్కా పాటిస్తే క్షణాల్లోనే గొంతు సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం తేనె కలుపకుండా నేరుగా వడకట్టిన నీటినే తాగాలి.