అందంగా కనిపించడం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మెరిసే చర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్లు రుద్దుతుంటారు. హెయిర్ కటింగ్లో, వస్త్రధారణలో సమ్థింగ్ స్పెషల్గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కండ్లకు ఐ లైనర్లు, పెదాలకు లిప్స్టిక్లు అంటూ వేటికీ వెనక్కి తగ్గరు. ముఖంపై ఇంత శ్రద్ధ చూపించే వ్యక్తులు పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తుంటారు. అయితే, పాదాల సంరక్షణ ఎలాగో తెలియక కొందరు వదిలేస్తే, ఆ.. కాళ్లు ఎలా ఉంటే ఏందిలే అని మరికొందరు అశ్రద్ధ చేస్తారు. కానీ, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా పాదాల పగుళ్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు..
పాదాల రక్షణకు చిట్కాలు..
1. నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వేరే నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
2. అదేవిధంగా యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మడిమల పగుళ్లకు కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
3. కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు, మడిమలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.
4. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పాదాలు పగుళ్లుబారుతాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.
5. పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు, మడిమలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.