అది ముంబై సమీపంలోని విరార్. అక్కడో దక్షిణాది టిఫిన్ సెంటర్. కొన్నిరోజులుగా ఆ హోటల్కు నలభై యాభై ప్లేట్ల టిఫిన్ల కోసం ఆర్డర్ వస్తున్నది. ఎవరైనా, సంతోషించాల్సిన విషయమే ఇది. కానీ ఆర్డర్ అందుతున్న సమయమే అనుమానాస్పదం. సరిగ్గా తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ వస్తుంది. అది కూడా బ్రిటిష్ కాలం నాటి పాడుబడిన ఓ బంగళా నుంచి.
అర్జెంటుగా పాతిక ప్లేట్ల ఇడ్లీలు, ఇరవై వడలు పంపేయ్. చాయ్ వేడిగా ఉండాలి’ అంటూ ఒకటికి పదిసార్లు చెప్పేవారు.
అక్కడి వాతావరణం చూశాక డెలివరీ బాయ్కి అనుమానం వచ్చింది. హోటల్ యాజమాని చెవిన వేశాడు. అసలే పరిస్థితులు, బాగా లేవు కాబట్టి, ఆ సమాచారాన్నిపోలీసులకు అందించాడా పెద్దాయన. అతని అనుమానం నిజమైంది. అదో ఆన్లైన్ ఫ్రాడ్ కాల్సెంటర్. ఇక్కడి నుంచే విదేశీయులను బురిడీ కొట్టించే కుతంత్రం సాగుతున్నది. ఒక ఆర్థిక సంస్థ పేరుతో ఆస్ట్రేలియా పౌరులకు ఫోన్లు చేసి బ్యాంక్ ఓటీపీ తెలుసుకుని..
నగదు కాజేయడమే ఆ ముఠా పని. ఎవరికీ అనుమానం రాకుండా చిమ్మచీకట్లో పని చేస్తున్నా, జీతాలన్నీ నగదు రూపంలో ఇస్తున్నా.. తెల్లవారు జామున ఇడ్లీ, వడ, చాయ్ ఆర్డర్లతో దొరికిపోయారు దొంగలు. బూత్ బంగ్లాకు అనుబంధంగా దేశవ్యాప్తంగా కాల్ సెంటర్లు ఉన్నట్టు పోలీసులకు వర్తమానం అందింది.