Eshwari | నిన్నటికి నిన్న సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో తెగ వైరల్ అయింది. అరటిగెలను ఓ పెద్దమ్మ మాగబెట్టిన తీరు చూసి అందరూ ముచ్చటపడ్డారు. నేలతల్లి ఒడిలో ఉంచి, బొగ్గు నిప్పుల పొగ పెట్టి, గెలను అరటి ఆకులతో కప్పెట్టిన వైనం ఇన్స్టా నుంచి ఎఫ్బీ వరకు క్యూట్ టాపిక్గా మారింది. కచ్చకాయలు రెండు రోజుల్లోనే తినడానికి అనువైన పండ్లలా మారడంతో ప్రకృతిలో ఉన్న వింతను పరిచయం చేసినందుకు అందరూ ఆమెకు జేజేలు పలికారు. రసాయనాలు చల్లి, కృత్రిమ విధానాలతో మాగబెట్టిన పండ్లను తింటున్న ఈ తరం.. ఈ బామ్మగారి కిటుకు తెలుసుకొని తెగ లైకులు కొట్టేసింది. ఆపై ఆమె ఎవరని ఆరాలు తీస్తే.. ఆమె కారాలు, మిరియాలు నూరుతూ చేసే పసందైన వంటకాల సంగతులూ వెలుగుచూశాయి.
తమిళనాడుకు చెందిన ఎస్.ఈశ్వరి వయసు 70 ఏండ్ల పైమాటే. సామాజిక మాధ్యమాల్లో ఆమె హుషారుగా ఉంటారు. సొంతంగా యూట్యూబ్ చానెల్ కూడా నడుపుతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ చానెల్కు 12.5 లక్షల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. ఈ గ్రామవాసి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఏడున్నర లక్షల మంది ఫాలో అవుతున్నారు. వీటి వేదికగా ఆమె షేర్ చేస్తున్న పాకాలు కొత్తపాఠాలు చెబుతున్నాయి. ‘సంప్రదాయ రుచులను మళ్లీ పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘బామ్మా.. మీది అమృతహస్తం’ అంటూ కితాబిస్తున్నారు.