ఇస్లామాబాద్: ప్రస్తుత సీజన్లో లభించే తియ్యతియ్యని మామిడిపండ్లను అందరూ తింటుంటే.. మధుమేహంతో బాధపడుతున్నవారు మాత్రం నోరు కట్టేసుకుంటున్నారు. పక్కవారు లొట్టలేసుకుంటూ తింటున్నా.. తినాలన్న కోరికను అణుచుకుంటున్నారు. మామిడిపండ్లను తింటే మరి షుగర్ పెరిగి తలనొప్పులు వస్తాయనేదే వారి భయం. ఇకపై అలాంటి భయం పెట్టుకోకుండా ఆరగించేందుకు మామిడిపండ్లు పాకిస్తాన్లో పండిస్తున్నారు. 4 నుంచి 6 శాతం చక్కెర స్థాయి కలిగిన మూడు రకాల చక్కెర రహిత మామిడి పండ్లను ఒక నిపుణుడైన రైతు పండిస్తున్నాడు. చక్కెర అధికంగా ఉన్నందున మామిడి పండ్లను తినలేకపోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపశమనం కలిగించనున్నది.
పాకిస్తాన్లోని దుకాణాల్లో విక్రయించే చక్కెర లేని మామిడిపండ్ల పేర్లు సోనారో, గ్లెన్, కీట్. సింధ్ టాండో అల్లాహార్లోని ఎంహెచ్ పన్వర్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రీయ మార్పు చేసిన తర్వాత ఈ రకం మామిడిపండ్లను పండిస్తున్నారు. “మామిడి, అరటితో పాటు వివిధ పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సీతారా-ఏ-ఇమ్తియాజ్ను పన్వర్కు ప్రదానం చేసింది. అతని మరణం తర్వాత అతడి పనిని కొనసాగించాను. ఇక్కడి వాతావరణం, మట్టిలో దాని పెరుగుదలను పరీక్షించడానికి విదేశాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లను దిగుమతి చేసుకున్న శాస్త్రీయంగా మార్పు చేశాం ” అని ఎంహెచ్ పన్వర్ వ్యవసాయ క్షేత్రం మామిడి నిపుణుడు గులాం సర్వార్ తెలిపారు. “కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉన్నదని, సోనారో, గ్లెన్ లలో చక్కెర స్థాయిలు వరుసగా 5.6 శాతం, 6 శాతం వరకు ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పాకిస్తాన్లో పలు మార్కెట్లలో లభిస్తున్న చక్కెర లేని మామిడి పండ్ల ధర కిలోగ్రాముకు రూ.150 గా ఉన్నది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టును వ్యక్తిగత శ్రద్ధతో పన్వర్ కుటుంబం నడుపుతున్నది. వీరికి చెందిన 300 ఎకరాల పొలంలో ప్రస్తుతం 44 మామిడి రకాలు అందుబాటులో ఉన్నాయి.