విద్య ఆలోచనలను మార్చగలదు. నైపుణ్యం జీవితాలను మార్చేయగలదు. కాబట్టే, కాకతీయ శాండ్బాక్స్ పుష్కరకాలంగా విద్యతోపాటు, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. సేద్యం నుంచి స్వయం ఉపాధి వరకు.. అవసరమైన ప్రతిచోటా సాంకేతికతను పరిచయం చేస్తున్నది.రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ, సియెర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు.
లింగ నిష్పతి, అక్షరాస్యత, ఆర్థిక, సామాజిక పురోగమనం.. ఒక ప్రాంత అభివృద్ధి సూచికలు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినా.. ఇప్పటికీ మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతున్నది. ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి పరిపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేదు.
ఈ అగాథాన్ని పూరించేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలు పూనుకున్నారు. ‘కాకతీయ శాండ్బాక్స్’ అనే వేదికను స్థాపించారు. విద్యార్థులు, యువత, మహిళలు, రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. పుష్కర కాలం క్రితమే ఆరంభమైన సేవలు ఫలితాలనూ ఇస్తున్నాయి. రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ, సియెర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి కలల పంట ఈ ప్రాజెక్ట్.
వ్యవసాయంలో..
వ్యవసాయంలో సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో రైతులకు తెలియని పరిస్థితి. అందులోనూ, ఉత్తర తెలంగాణలో పత్తిపై ఆధారపడిన రైతులు ఎంతో మంది. వారి కోసం బెటర్ కాటన్ ఇనీషియేటివ్(బీసీఐ) కార్యక్రమం ద్వారా నాణ్యమైన పత్తిని పండించేలా కాకతీయ శాండ్బాక్స్ కృషి చేస్తున్నది. నిపుణుల బృందాల సాయంతో రైతులకు సాంకేతిక సహకారం అందిస్తున్నది. బెటర్ కాటన్ ఇనీషియేటివ్(బీసీఐ) ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో 90 వేల మంది రైతులు 70 వేల మెట్రిక్ టన్నుల నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేశారు.
దీనివల్ల రైతుల ఆదాయం 18 శాతం మేరకు ఎగబాకింది. దాంతోపాటే, ఫామ్పాండ్ కార్యక్రమాన్నీ పెద్ద ఎత్తున తలపెట్టారు. సేద్యంలో నీటి కొరతను తీర్చేందుకు ఈ చిన్నపాటి జలాశయాలు సాయపడతాయి. దీనివల్ల పంట ఎండిపోయే పరిస్థితి ఉండదు. ఈ మహత్కార్యంలో కేసీఆర్ సర్కారు తనవంతు సాయం అందించింది. ఇప్పటి వరకు 7వేలకు పైగా ఫామ్పాండ్లు నిర్మించారు. దీనివల్ల, యాసంగిలో దిగుబడి పెరిగింది. రైతుకు వ్యవసాయ ఆదాయమూ పెరిగింది. వరి నాట్లలోనూ యాంత్రాలను పరిచయం చేశారు.
మహిళా సాధికారత.. నైపుణ్యాభివృద్ధి..
ఉత్తర తెలంగాణలో ఔత్సాహిక మహిళలకు సరికొత్త వ్యాపార అవకాశాల్ని పరిచయం చేస్తూ.. మగ్గం వర్క్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసుల తయారీ, జనపనార సంచుల ఉత్పత్తి, ఎంబ్రాయిడరీ, కుట్టుపనిలో శిక్షణ ఇప్పిస్తున్నది శాండ్బాక్స్. ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు 2,388 మందికి శిక్షణ ఇచ్చారు. 5,668 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విద్య, ఉపాధి నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు స్కిల్ ప్లస్, స్కిల్ ప్లస్ ఆర్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నారు. డిగ్రీ పూర్తయిన వారికి కాకతీయ శాండ్బాక్స్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడమే కాదు.. డిగ్రీ చదువుతున్న వారికి కళాశాలల్లోనే ప్రత్యేక తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. స్కిల్ ప్లస్ ఆర్ కింద 1,400 మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించారు. 95శాతం మేర ప్లేస్మెంట్ ఇప్పించారు.
స్కిల్ ఇన్ విలేజ్ కార్యక్రమం ద్వారా 30 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ పేద విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. క్రీడా నైపుణ్యాన్నీ వెలికి తీస్తున్నారు. శాండ్బాక్స్ బృందాలే.. పాఠశాలలకు వెళ్లి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, ఆంగ్ల భాషల్లో నైపుణ్యాలను బోధిస్తాయి. 2026-27 నాటికి 150 కేంద్రాలను ఏర్పాటు చేసి, 18వేల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చాలనేది సంకల్పం. ‘నిర్మాణ్’ అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో ఓ టోల్ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేశారు. 1800-425-2425 నంబరుకు ఫోన్కాల్ చాలు.. ఉద్యోగ ప్రకటనలు, కెరీర్ గైడెన్స్ సమాచారం, సలహాలు, సూచనలు అందుకోవచ్చు. పది, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం విషయంలో రూట్ మ్యాప్ అందిస్తున్నారు.
త్వరలో రూరల్ స్టార్టప్
హైదరాబాద్లోని టీ-హబ్ తరహాలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో రూరల్ స్టార్టప్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇది అచ్చమైన గ్రీన్ బిల్డింగ్. ధారాళమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కన్వల్ రేఖి సహకారంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. దీన్ని కన్వల్ రేఖి రూరల్ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్ సెంటర్(కేఆర్ఈఎస్టీ -క్రెస్ట్)గా వ్యవహరిస్తారు. కె-హబ్ గానూ నామకరణం చేశారు. దేశంలోనే తొలి గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది.
ఇందూరు బిడ్డలు
కాకతీయ శాండ్బాక్స్ను స్థాపించిన ఇద్దరు వ్యాపారవేత్తలదీ ఇందూరు ప్రాంతమే. ఇందులో రెడ్బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ ఒకరు కాగా, సియెర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి మరొకరు. పుట్టిన గడ్డకు తమవంతుగా ఏదైనా చేయాలనే తపన ఇద్దరిదీ. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా పనిచేస్తున్న దేశ్పాండే ఫౌండేషన్ స్ఫూర్తితో కాకతీయ శాండ్బాక్స్ను స్థాపించారు. కరీంనగర్కు చెందిన శ్రీకాంత్రెడ్డి పాకాల కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నారు.
…? జూపల్లి రమేశ్ రావు