భారతీయ చిత్రకళపై ఆధ్యాత్మికత ప్రభావం ప్రబలంగానే ఉంటుంది. ఆ కళ క్యాన్వాస్ను దాటుకుని చీరలపైనా చేరింది. డాక్టర్ అనితా షా అధ్యయనమంతా ఈ కోణంలోనే జరిగింది. ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో హైదరాబాద్ ఆదరించిన కళల చరిత్రను ఆమె ఆవిష్కరించారు. పనిలోపనిగా తన మూలాలనూ వెదుక్కున్నారు. పదహారో శతాబ్దంలో కృష్ణతత్వాన్ని ప్రబోధించిన వల్లభాచార్యుని భావాలు క్రీ.శ 1500 నుంచి క్రీ.శ 1900 వరకు ఆధ్యాత్మిక రంగాన్నే కాకుండా చేనేత కళనూ ప్రభావితం చేశాయి.
మన దగ్గర సిద్దిపేట గొల్లభామ చీరలకు ఎంత గిరాకీ ఉందో, ఉత్తర భారతాన వల్లభాచార్యుల కృష్ణతత్వాన్ని చాటే అద్దకపు వస్ర్తాలకూ అంత ఆదరణ ఉంది. నిర్మాణాలు, చిత్రాలు, చేనేత వర్ణాలు, కలంకారీ అద్దకాల వెనుక ఉన్న వల్లభతత్వాన్ని అనితా షా తన రచనలో వివరించారు. ఆమె పూర్వికులు ఉత్తర భారతం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన వల్లభాచార్యుని అనుయాయులు. తొలి తరానికి చెందిన జగ్జీవన్దాస్ మొదటి నిజాం హయాంలో ఇక్కడ స్థిరపడ్డాడు. తమ ప్రాంత సంస్కృతినే అనుసరిస్తూ హైదరాబాద్లో అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఈ విశేషాలన్నీ అన్వేషించి.. చరిత్రలో నమోదయ్యేలా కృషి చేశారు అనిత.