ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత అవసరం.. ఏం తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. పరగడుపున పండ్లు తింటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని అనుకుంటారు. కానీ, పరగడుపున తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
నారింజ
సి విటమిన్ ఎక్కువగా లభించే నారింజ పండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ, వీటిని పరగడుపున, అల్పాహారంతో తినకూడదు. అందులో ఉండే సిట్రస్ ఆమ్లం వల్ల కడుపులో యాసిడ్ చేరుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో వీటిని తీసుకుంటే మంచిది.
పుచ్చకాయ
పుచ్చకాయల్లో 90% నీరు ఉంటుంది. తినగానే సులువుగా అరిగిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో తింటే పెద్దగా ఉపయోగం ఉండదు. తిన్న గంటకే విపరీతమైన ఆకలి వేస్తుంది.
మామిడిపండ్లు
మామిడిపండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే తింటే రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. మిగతా సమయాల్లో నిరభ్యంతరంగా తినొచ్చు.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలు పుల్లగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే తింటే కడుపులో ఆమ్లాలు చేరి ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
అరటిపండ్లు
అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం మెండుగా ఉంటాయి. అయితే, అరటిపండ్లను ఓట్స్లో లేదా బ్రౌన్ బ్రెడ్లో కలిపి తింటే మంచిది. కానీ, పరగడుపున తినకూడదు. అలా తీసుకుంటే రక్తంలో మెగ్నీషియం, పొటాషియం స్థాయుల్లో తేడా వస్తుంది.