Parental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది. సంక్రాంతి వేళ.. పతంగుల కోలాహలం సరదా కోసం చేసిన ఆచారం కాదు. శీతకాలంలో.. సూర్యుడి ప్రభావం తగ్గి విటమిన్-డి లోపిస్తుంది. దీని ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది.
ఈ సమస్య తలెత్తకుండా ఎండకు నిలబడి పతంగులు ఎగురవేసే సంప్రదాయాన్ని ఏర్పరిచారు పెద్దలు. నిన్నటి తరం ఆటల సంప్రదాయాన్ని ఆనందిస్తూ.. ఆరోగ్యాన్నిపొందింది. కానీ, నేటి బాలలే… సెల్ఫోన్ ఆటల్లో తలమునకలై అందమైన బాల్యాన్ని ఆగం చేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్ వ్యసనంనుంచి బయట పడేయలేకపోతే ఈ తరం భవిత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
డిజిటల్ టెక్నాలజీ ప్రపంచంలో పదేండ్ల పిల్లలు, యువత ఆన్లైన్ గేమ్లకు బానిసలుగా మారారన్నది కఠోర వాస్తవం. ఇంట్లో సోఫానే మైదానంగా భావిస్తున్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ఫోనే ఆటవస్తువుగా ఫిక్సవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ కాలక్షేపం నుంచి వ్యసనంగా మారిపోయాయి. ఫలితంగా పిల్లలు చదువులో వెనక బడటమే కాక, వారి ఆలోచనలు కూడా పక్కదారి పడుతున్నాయి. మోమో చాలెంజ్, పబ్జీ, బ్లూ వేల్ చాలెంజ్ లాంటి ఆన్లైన్ గేమ్లు ఎందరి జీవితాలనో బలి తీసుకుంటున్నాయి. పిల్లలకు ఫోన్ దూరం చేసినప్పుడు వారి ప్రవర్తనలో తీవ్రమైన విచారం, ఆందోళన చోటు చేసుకుంటున్నాయని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది. ఫోన్ లాక్కున్నందుకు ఆత్మ హత్యకు పాల్పడిన వార్తలూ చదువుతూనే ఉన్నాం.
ఆన్లైన్ గేమ్స్ సమయాన్ని హరిస్తూనే.. అందిన కాడికి దోచుకుంటున్నాయి. ఆటలో తర్వాతి లెవల్కు వెళ్లడానికి, షూటింగ్ గేమ్స్లో ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. ఫ్రీ-టు-ప్లే అంటూనే.. లెవల్స్ దాటిన తర్వాత డబ్బులు కడితేనే తర్వాతి లెవల్ అంటున్నాయి. గేమ్కు అలవాటుపడిన చాలామంది.. తల్లిదండ్రులను ఏమార్చి క్రెడిట్కార్డు, డెబిట్కార్డుతో డబ్బులు కట్టిమరీ వాటిని కొనసాగిస్తున్నారు.
మల్టీ ప్లేయర్ గేమ్స్ ఫ్రీ అని చెబుతూనే ఇంకో తరహాలో వేధిస్తుంటారు యాప్ నిర్వాహకులు. యాప్లలో ప్రకటనలు వేలం వెర్రిగా వస్తుంటాయి. గేమ్ ప్రొడక్ట్ కొనుగోలు చేయాల్సిందిగా ప్రకటనలు క్యూ కడతాయి. ఇన్సెంటివ్ బేస్డ్ అడ్వర్టయిజులు వస్తుంటాయి. ప్రీమియమ్ వెర్షన్ కొనుగోలుకు, గేమ్ అప్డేట్కు డబ్బులు చెల్లించాల్సిందిగా సందేశాలు పంపుతుంటాయి. ఉచిత సభ్యత్వం అంటూనే ఊరించే ఆఫర్లూ వస్తుంటాయి. మొత్తంగా ఆటకు అలవాటుపడిన వాళ్ల నుంచి ఏదోరకంగా డబ్బులు వసూలు చేయడమే వీటి లక్ష్యం.
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్లకైతే ఆన్లైన్లో కొదువ లేదు. కలర్ ప్రెడిక్షన్ యాప్ అలాంటిదే! ఇందులో రంగుల కలయికను అంచనావేసి పందెం కాస్తుంటారు. మొదట ఆధార్కార్డు, పాన్కార్డు, ఇతర వివరాలు నమోదు చేసేలా ప్రోత్సహిస్తారు. ఎక్కువమందిని జాయిన్ చేస్తే రివార్డు అందుతుందని మభ్యపెడతారు. ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్లేయర్ పేరిట బ్యాంక్ ఖాతాను తెరిచి, ఖాతాకు ఇ-వాలెట్ను లింక్ చేస్తారు. ఇక బెట్టింగ్ మొదలవుతుంది. ఒకట్రెండు తేలిక కాంబినేషన్లు రంగులను అంచనా వేయమని.. వాటి ఫలితం ఆటగాళ్లకు అనుకూలంగా వచ్చేలా చూస్తారు. గెలిచామన్న ఉత్సాహంతో పెద్దమొత్తంలో పందెం కాసేలా ప్రేరేపిస్తారు.
యాప్ వాలెట్లో గెలుచుకున్న మొత్తం కనిపిస్తుండటంతో డబ్బు ఎక్కడికీ పోదన్న ధీమాతో పెద్ద మొత్తంలో పందెం కాస్తారు. అదీ గెలిచినా డబ్బు విత్ డ్రా చేయాలంటే ఇన్కమ్ట్యాక్స్, జీఎస్టీ ఫీజుల పేరుతో అడ్వాన్స్ చెల్లించాలని మరిన్ని డబ్బులు వసూలు చేసి.. మొత్తంగా కుచ్చుటోపి పెడతారు. డబ్బు బదిలీ చేసిన తర్వాత, ఫ్రాడ్స్టర్లు కమ్యూనికేషన్ మార్గాలను బ్లాక్ చేస్తారు. దాదాపు అన్ని రకాల ఆన్లైన్ ఫ్రాడ్ గేమ్స్ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఈ తరహా యాప్లు గూగుల్ ప్లేస్టోర్లో, ఐఓఎస్ యాప్స్టోర్లో అందుబాటులో లేకున్నా… .APK, .DMZ ఫైల్స్ ద్వారా మోసపూరిత గేమింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్లు పంపుతారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా, ముందుగా జాగ్రత్త పడటం అన్ని రకాలుగా శ్రేయస్కరం. పిల్లలు ఫోన్ బారిన పడకుండా కన్నవారు చర్యలుతీసుకోవాలి. స్క్రీన్ టైమ్ ఇంత అని ఫిక్స్ చేయండి. వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో షేర్ చేసుకోవద్దని పిల్లలకు చెప్పండి. ఆన్లైన్ గేమింగ్ కోసం మీ కార్డు ఉపయోగించినట్టు తెలిస్తే ఉపేక్షించకండి. యాప్ కొనుగోళ్లకు అంగీకరించకండి. పేరెంటింగ్ కంట్రోల్స్ సెట్టింగ్స్ మార్చండి.
అనిల్ రాచమల్ల, ఎండ్నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు