Inspiration | ఆమె పేరు డేరంగుల నారాయణమ్మ. కొండలు పగలేసి, బండలు తవ్వే వడ్డెర వృత్తిలో ఒడలు వంచి పనిచేసేది. ఖాళీ సమయంలో తీర్థయాత్రలు చేస్తూ దేశమంతా తిరిగేది. కానీ, ఎక్కడా దేవుడు కనిపించలేదు. గుడిలో లేని పరమాత్మ దేహంలో ఉన్నాడని అర్థమైపోయింది. అంతే, కర్మయోగిగా మారింది. తనలోని దేవుడిని ఆరాధిస్తూ, తనచుట్టూ ఉన్న పరిసరాలను తన ఆత్మలాగే స్వచ్ఛంగా ఉంచుతున్నదా పారిశుద్ధ్య కార్మికురాలు. బంజారాహిల్స్లోని ఓ ఖరీదైన కాలనీ ఆమె చీపురు చప్పుళ్లతోనే మేల్కొంటుంది. అక్కడి వీధులు ఆమె చెమటతో స్నానం చేస్తాయి. ఆమె పాదధూళిని పౌడరులా రాసుకుంటాయి. నిండైన నిబద్ధతతో ‘జాతీయ కర్మచారి అవార్డు-2024’ గెలుచుకున్న నారాయణమ్మ బతుకు ప్రయాణం ఆమె మాటల్లోనే..
బావులు తవ్వినం. బావులకు తెట్టెలు కట్టినం. (బాయితెట్టె).. భూములకు రాతిగోడలు కట్టినం.. మా ఆయన సివిల్ కాంట్రాక్టర్. ఎటు పనికి పోయినా 100 మందిమి పోతుండె. పనిలేకుంటే మేమిద్దరం తీర్థయాత్రలు చేసేది. దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగొచ్చినం. శ్రీలంకకూ పోయొచ్చినం. పిల్లలు పుట్టాక వాళ్లని కూడా తీస్కపోయినం. దేవుని అనుగ్రహం దొరుకు తుందని 20 ఏండ్లు యాత్రలు చేశినం. పోని తీర్థం లేదు. సూడని గుడి లేదు. ఆ ఖర్చులకే అంతా పోయింది. ఏమీ మిగల్లే. ఏడ చూశినా మనిషి కట్టిన గుడి.. మనిషి చెక్కిన విగ్రహమే. మనిషే దీపం పెట్టాలె. ‘శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి.. మొక్కుదురేల వెర్రి మూర్ఖులారా… జీవులందె కాని శిలలందు లేడయా విశ్వదాభిరామ వినురవేమ’ అని వేమన యోగి చెప్పినట్టు రాతి విగ్రహాలల్ల దేవుడు లేడని తెలిసొచ్చింది. జమ్మికుంట దగ్గరున్న శ్రీరాములపల్లి పోయి గురుబోధలో చేరినం. నిత్యానంద రాజేశ్వరార్యులు, విమలాంబ వద్ద శిష్యరికం చేశినం. అప్పటి నుంచి నా పేరును నిశ్చలాంబ దేరంగుల నారాయణమ్మగా మార్చుకున్న. ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తున్న. పనిలో పరమాత్మను చూస్తున్న.
మా సొంతూరు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్. మా ఆయన ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చినం. ఆడా ఈడా ఉన్నం. ఆఖరికి వినాయక నగర్ బస్తీ పడుతుందంటే వచ్చి గుడిసె ఏసుకున్నం. ఈ బస్తీలో ఫస్ట్ గుడిసె మాదే. పనిచేసే రోజుల్లో మా ఆయన బాగా తాగెటోడు. లివర్ పాడైంది. దవాఖానకు పోతే క్యాన్సరన్నరు. మూడేండ్లు బాధలువడ్డం. కొడుకు, బిడ్డని ఊళ్ల ఉంచి ఏడాది ఉస్మానియా దవాఖానల ఉన్నం. అంత కష్టపడ్డా బతకడన్నరు. ఇంటికి తీస్కపోయిన. 15 రోజులకు సచ్చిపోయిండు. సావు దినాలు అయినయ్. అప్పులున్నయ్. వినాయక నగర్ (ఫిల్మ్ నగర్లో) గవర్నమెంట్ ఇచ్చిన 50 గుంటల జాగ, అందులో చిన్న గుడిసె ఉన్నది. లీడర్లు కమిషన్ల కోసం జాగా అమ్మాలని ఒత్తిడి చేసిండ్రు.
నేనే అమ్మి అప్పులు తీర్చిన. ఇంకో జాగా చూపిస్తమంటే లీడర్లని నమ్మి వాళ్ల చేతిల డబ్బులు పెట్టిన. రెండేండ్లయినా జాగా రాలే. వాళ్ల మీద కేసు పెట్టిన. నారాయణమ్మకు న్యాయం చేయాలని పేపర్ల వార్త వచ్చింది. ఆర్డీవో లక్ష్మి మేడం నా సమస్య తీర్చమని చెప్పింది. ఎమ్మార్వో చంద్రకళ మేడం, వీఆర్వో వచ్చి.. ఖాళీ జాగా చూపిస్తే ఇస్తమన్నరు. అక్కడ ఒక బోడు ఉంటె సూపించిన. బండల్ని బ్లాస్ట్ చేపించిన. చెట్లన్నీ కొట్టిపిచ్చిన. సదును చేయించి చిన్న గుడిసె వేసుకున్న. ఆ జాగా మీద కూడా లీడర్ల కన్నువడ్డది. కంటిమీద కునుకు లేకుండ జేసిండ్రు. పట్టా రాకుండ చేసిన్రు. అయినా గుడిసె ఏసుకుని ఆడనే ఉంటున్న.
గిదిగో గీ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంట బతుకుతున్న. నెలకు 14 వేలు చేతిల పడుతయ్. కొడుకు లారీ డ్రైవర్ పని చేస్తున్నడు. నా బిడ్డ నా లెక్కనే స్వీపర్. ఫిల్మ్నగర్ల (బాల్రెడ్డి నగర్) ఉంటాంది. పొద్దునే లేసుడు. రోడ్లు ఊడ్వనీకి పోవుడే నా పని. బంజారాహిల్స్ రోడ్ 12, వేమిరెడ్డి ఎన్క్లేవ్ ఏరియాల పని చేస్తున్న. యూట్యూబ్లల్ల ఈ మధ్య చానా మంది పాటలు పాడతున్నరు. నాకు పాటలు, తత్వాలు, పద్యాలు వస్తయ్. నేనూ పాడతా అని ఓ ఛానల్ వాల్లతోని అంటే పాడమన్నరు. పాడితే.. మస్త్ పాపులర్ అయిన.
అయి జూసి లోకమంతా ఎరుకయ్యింది. ఇంకొన్ని ఛానళ్లు వచ్చినయ్. మున్సిపాలిటీ ఆఫీసర్లంతా మన డిపార్ట్మెంట్ల ఇంత టాలెంట్ ఉన్నోళ్లున్నరని మస్త్ ఖుషీ అయిండ్రు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సార్ నన్ను పిలిచి సన్మానం చేసిండు. పోలీసోళ్లు డీజీపీ ఆఫీసుకు తీస్కపోయిండ్రు. అక్కడ పెద్ద సారు.. వందల మంది పోలీసుల ముందు నాకు సన్మానం చేసిండు. ఢిల్లీల అవార్డు ఇస్తమని ఆఫీసర్లు పిలిచిండ్రు. 24వ తారీఖున పోతున్న. జెండా వందన రోజున అవార్డు అందుకుంట.
మా అమ్మ స్వీపర్ పని చేస్తుండేది. ముసల్దయినంక ఎందుకీ కష్టమని మా తమ్ముడు వద్దన్నడు. ‘బిడ్డా నా పని నువ్వు తీసుకో’ అని మా అమ్మ నన్ను ఈ పనిల వెట్టింది. అట్ల వచ్చి 22 ఏండ్ల నుంచి రోడ్లు ఊడ్చుకుంట బతుకుతున్న. ఏ పని సేసినా భగవంతుడిని మరువలే. పొద్దుగాల మూడు గంటలకు లేస్త. ముఖం కడిగి, స్నానం చేసి, అనుష్టానం చేస్త. తర్వాత ధ్యానం. ఇగ చాయ్ చుక్క తాగి పనికి బయలెల్లుత.
– నాగవర్ధన్ రాయల
-సి.ఎం. ప్రవీణ్