Counselling | నవతరం జంటల్లో రోజురోజుకూ విడాకులు పెరిగిపోతున్నాయి. పెండ్లి తర్వాత రెండు మూడేండ్లు కలిసి కాపురం చేయడం కూడా కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేండ్లుగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో విడాకుల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో విడాకుల ప్రతిపాదనలు 70 శాతం వరకు మహిళల నుంచి వచ్చినవి కావడం గమనార్హం. కోజికోడ్ జిల్లాలోని ఓ చిన్న పంచాయతీ అయిన పెరువాయిల్ గ్రామ పెద్దలకు ఆందోళన కలిగించింది.
పరిస్థితులు విషమిస్తుండటం వారు గమనించారు. పెండ్లయిన కొత్త జంటలను సాధ్యమైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. విడాకులను నివారించడానికి కొత్తగా పెండ్లయిన వారికి, పెండ్లి చేసుకోబోయే వారికి ఉచిత కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని రూపొందించారు. పెండ్లికి ముందు, పెండ్లయిన తర్వాత నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించడం మొదలు పెట్టారు. ఇలా చేస్తున్న గ్రామ పంచాయతీ భారతదేశంలో పెరువాయల్ ఒక్కటే కావచ్చు. విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని కేరళలోని ఇతర గ్రామాలు కూడా అనుసరిస్తున్నాయి.
పెరువాయల్లో ఇప్పటివరకు 350 జంటలకు సుశిక్షిత కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ సెషన్లలో కొత్త జంటలకు ప్రేమ, దాంపత్యం, వ్యక్తిగత శుభ్రత, ఆర్థిక వ్యవహారాలు, నమ్మకాలు, విలువలు, పేరెంటింగ్, కుటుంబ సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడం తదితర అంశాల గురించి వివరిస్తారు. పెండ్లయిన వారికైతే.. ఆ బంధం జీవిత కాలం నిలుపు కోవడం ఎలా అనేది కౌన్సెలింగ్ ఇస్తారు. పెరువాయల్ విజయగాథ నుంచి పొరుగునే ఉన్న పెరుమన్న పంచాయతీ కూడా స్ఫూర్తి పొందింది.
అక్కడ కూడా కౌన్సెలింగ్ సేవలు మొదలుపెట్టారు. వివాహ బంధం పదికాలాలపాటు పచ్చగా సాగడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే. అయితే… “నేటి మహిళలు బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అసంతృప్తికరమైన బంధాలను ఏమాత్రం కొనసాగించాలని అనుకోవడం లేదు. కాబట్టి విడాకుల విషయంలో ఆడవాళ్లను మాత్రమే తప్పుపట్టవద్దు” అంటారు నీనా రాజన్ అనే సామాజిక కార్యకర్త. కాకపోతే, బంధం బలోపేతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతోకొంత సహకరిస్తాయనేది అందరి అభిప్రాయం.