ఆన్లైన్ కొనుగోళ్లు మొదలయ్యాక కిరాణా దుకాణాలకు కష్టకాలం ఆరంభమైంది. ఏ వస్తువునైనా నిమిషాల వ్యవధిలో తెప్పించుకోవచ్చు. ధర తక్కువ. డిస్కౌంట్లు ఎక్కువ. విస్తృతమైన బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఆన్లైన్కు అదనపు హంగులే. అలా అని కిరాణా కొట్టుకు కాలం చెల్లిపోయినట్టు కాదు. తక్షణ అవసరాలకు.. ఇంటి పక్కనో, సందు చివరనో ఓ దుకాణం కనిపించి తీరుతుంది. చిరునవ్వుతో పేరుపెట్టి పలకరించే చిరు వ్యాపారి దర్శనమిస్తాడు. ఇప్పటికీ మనదేశంలో 90 శాతం చిల్లర వ్యాపారం వీరి ద్వారానే జరుగుతున్నది.
దేశంలో 1.3 కోట్ల కిరాణా దుకాణాలు ఉన్నాయని అంచనా. ఈ కీలక వ్యవస్థకు సేవలు అందించడం కూడా ఓ వ్యాపారమే అని గ్రహించారు శ్రుతి. ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న ఈ యువతి ‘అప్నా క్లబ్’ పేరుతో టోకున సరుకులు సరఫరా చేసే సంస్థను ప్రారంభించారు. దీనివల్ల కిరాణా వ్యాపారులు ఎక్కడికో వెళ్లి తెచ్చుకునే అవస్థ తప్పుతుంది. రవాణా చార్జీలు మిగులుతాయి. సమయం కలిసొస్తుంది. ఇప్పటివరకు 55 వేలమంది కిరాణా యజమానులకు అప్నా క్లబ్ ద్వారా లక్షలాది ఉత్పత్తులు అందాయి. సొంతంగా గిడ్డంగులను ఏర్పాటు చేసుకుంటూ విస్తరణ దిశగా సాగుతున్నది అప్నా క్లబ్. శ్రుతి తండ్రి ఐఏఎస్ అధికారి. దీంతో, బీహార్లో పుట్టినా దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగారామె.