వినాయకుడి పూజలో ద్రవ్యాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే! ముఖ్యంగా గరిక అంటే గణపతికి ప్రీతి. దూర్వయుగ్మం సమర్పిస్తే చాలు ఉప్పొంగిపోతాడు. అయితే గౌరీతనయుడికి గరిక అంత ప్రీతిపాత్రం ఎందుకో తెలిపే కథ గణేశ పురాణంలో కనిపిస్తుంది. ఒకసారి దేవ సభలో నర్తిస్తున్న తిలోత్తమను చూసి యముడు మోహ పరవశుడు అవుతాడు. ఆ మోహంలోంచి అగ్నికీలల రూపంతో ఓ అసురుడు జన్మిస్తాడు. పుట్టిన వాడు అంతలోనే ఎంతో ఎదిగి తన అగ్నితో అక్కడివారందరినీ భయభ్రాంతులకు గురిచేస్తాడు. అగ్ని శరీరంగా ఉన్నవాడు కావడంతో అతణ్ని అనలాసురుడు అని పిలిచారు. అనలాసురుడు భూమి మీదికి వచ్చి ఊళ్లకు ఊళ్లు దగ్ధం చేయసాగాడు. ఈ ఆపదను తప్పించాల్సిందిగా దేవతలు గణపతికి మొరపెట్టుకున్నారు. వినాయకుడు బాలుడి రూపంలో దిగి వచ్చి.. అనలాసురుణ్ని అమాంతం మింగేసి గొంతులో దాచాడు. ముల్లోకాలూ ఊపిరి పీల్చుకున్నాయి. గొంతులో చేరిన అనలుడి కారణంగా గణపతి శరీరం తాపంతో రగిలిపోయింది. శరీరంలో పుట్టిన ఉష్ణానికి తాళలేకపోయాడు.
తమను కాపాడిన గణపతికి ఉపశమనం కలిగించాలని ఇంద్రుడు నెలవంకను గణపతి శిరస్సుపై అలంకరించాడు. అయినా తాపం చల్లారలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కన్యలను ప్రసాదించాడు. అయినా పరిస్థితి మారలేదు. వరుణుడు గణపతి మునిగేలా వర్షం కురిపించినా ప్రయోజనం లేకపోయింది. భూలోకంలోని వేలమంది మునులు ఒక్కొక్కరూ 21 గరిక పోచలను తెచ్చి.. గణపతి శిరస్సుపై ఉంచారు. గరికపోచలు వినాయకుణ్ని పూర్తిగా ముంచెత్తాయి. ఆశ్చర్యకరంగా గడ్డిపరకల్లోంచి పొగలు వచ్చాయి. మరి కాసేపటికి తాపం మొత్తం చల్లారిన గణపతి గరికల నుంచి బయటికి వచ్చి చిరునవ్వులు చిందించాడు. అప్పటినుంచి తన పూజా ద్రవ్యాల్లో గరిక ప్రశస్తమైనదని గణపతి ప్రకటించాడు. భక్తితో 21 గరిక పోచలు గానీ, కనీసం ఒక్కటి సమర్పించినా వారిని అనుగ్రహిస్తానని వరమిచ్చాడు. ఆనాటి నుంచి గణపతికి గరిక ప్రియుడు అన్న పేరు సార్థకమైంది.