పోషకాహారం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమని అనుకుంటారు చాలా మంది. ఆ ఆలోచన తప్పని రుజువు చేస్తూ, బలవర్ధకమైన ఆహారాన్ని అన్ని వర్గాల వారూ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నది ‘ఫుడ్శాల’ ఫౌండేషన్. ఆ ప్రయత్నంలో పోషకాహార నిపుణులతో కలిసి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ సంస్థ స్థాపకురాలు రాధికా గుప్తా. ఇప్పటికే పదిహేడు వందల మందికి పైగా చిన్నారులకు శిక్షణనిచ్చారు.
దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో పోష కాహార లోపం ఒకటి. ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిలో అధికశాతం చిన్నారులే. అందుకే పిల్లల్లో పోషకాహార లోపాన్ని తరిమికొట్టేలా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది ‘ఫుడ్శాల’ ఫౌండేషన్. లక్ష్య సాధన కోసం పేదలు చదివే పాఠశాలల్ని ఎంచుకుంది. రోజూ ఆ పిల్లలు తీసుకునే ఆహారం ఏమిటన్నది తెలుసుకుని.. అందులో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా దాన్నే పోషకా హారంగా ఎలా మార్చుకోవచ్చన్నది బోధిస్తుంది. హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్న రాధికను ఎప్పుడూ ఒక ఆలోచన వెంటాడేది.
ఆరోగ్యకరమైన ఆహారం సంపన్నులకే పరిమితం కాకూడదన్నది తన అభిప్రాయం. పేదవారికి కూడా బలవర్ధకమైన భోజనం అందించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారామె. ఆ ప్రయాణంలో కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశారు. భర్త అమిత్ సహకారంతో హరియాణాలోని పదిహేను వందల మంది చిన్నారులకు చవకైన పోషకాహారాన్ని అందించే ప్రాజెక్టునూ చేపట్టారు. కొవిడ్ దెబ్బకు ఆ కార్యక్రమం మూతబడింది. దీంతో ఆమె ఆలోచన మారింది. ఏదో ఒక చోట పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ‘ఫుడ్శాల’కు ప్రాణం పోశారు.
ఆసక్తి కలిగించేలా…
పిల్లలకు ఏదైనా విషయం పట్ల అవగాహన కలిగించాలంటే దాన్నో వినోదంలా మార్చాలి. చిన్నచిన్న బహుమతులతో ఊరించాలి. అందుకే ‘ఫుడ్శాల’ తన కార్యక్రమాల్ని ఓ ఆటలా మలిచింది. దాని ద్వారానే ఆహారపు అలవాట్ల విషయంలో చిన్నారుల పరిజ్ఞానాన్ని పెంచింది. భోజన పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చింది. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించింది. తాము వర్క్షాప్ నిర్వహించబోయే ప్రాంతంలో చిన్నారుల ఆహార పద్ధతుల గురించి ముందుగా తెలుసుకుంటారు ఫుడ్శాల వలంటీర్లు. ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులను ఎంచుకుంటారు. వారిని బృందాలుగా విడదీసి.. ఆరోగ్యం, పౌష్టికాహారం, జంక్ఫుడ్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తారు. దీంతో పిల్లల్లో ఆసక్తి మొదలవుతుంది. తర్వాత సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ఊబకాయం.. తదితర అంశాల పట్ల అవగాహన కల్పిస్తారు. క్రమంగా పిల్లలు జంక్ఫుడ్ తమకు హాని చేస్తుందని తెలుసుకుంటారు. బయటి తిండిని దూరం పెడతారు. సిరి ధాన్యాలను ఇష్టపడతారు.
తక్కువ బడ్జెట్లో..
తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారానికి ఎంత ఖర్చు పెట్టగలరో తెలుసుకుని, అంతే బడ్జెట్లో పౌష్టికాహారాన్ని సిద్ధం చేసుకునేలా ఈ వర్క్ షాప్లు అవగాహన కల్పిస్తాయి. ఇక్కడే గృహిణులకు పాకశాస్త్ర పాఠాలు బోధిస్తారు. ఉదాహరణకు పిల్లలు ఇష్టంగా తినే శాండ్విచ్లో ఆలుగడ్డకు బదులు సోయా వాడమని చెబుతారు. అలాగే, నూడుల్స్లో ఆకుకూరల శాతం పెంచమని సూచిస్తారు. ఇడ్లీలకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు వచ్చేలా కూరగాయల తురుము కలిపితే ఆకర్షణీయంగా ఉంటుందని గుర్తు చేస్తారు. దీనివల్ల మారాం చేయకుండానే పోషకాహారాన్ని తీసుకోగలరని వివరిస్తారు సంస్థ స్థాపకురాలు రాధికా గుప్తా. ఇప్పటి దాకా ఫుడ్శాల ద్వారా గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, పుణె తదితర ప్రాంతాల్లోని సుమారు పదిహేడు వందల మంది పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామనీ, పోషకాహార లోపంలేని భారతదేశాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామనీ అంటారామె. తిండి కలిగితే కండ కలదోయ్.. కండకలవాడేను మనిషోయ్…అన్న గురజాడ వారి మాటలు నిజం కావాలన్నా, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం జరగాలన్నా ఇలాంటి సంస్థల అవసరం ఎంతో ఉంటుంది!