డిజిటల్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఇలాంటి తరుణంలో వినియోగదారుల ప్రాధాన్యాలను ప్రభావితం చేయడం, వివిధ బ్రాండ్లకు ప్రచారం కల్పించడంలో ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర కీలకంగా మారిపోయింది. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మాసుమ్ మీనావాలా అంతగా ప్రాచుర్యం పొందని భారతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా తనవంతు మద్దతు అందిస్తున్నది. మాసుమ్ చూపుతున్న చొరవ చిన్న వ్యాపారాల్లో సానుకూల మార్పు దిశగా అవకాశం కల్పిస్తున్నది. “భారతదేశంలో చిన్న వ్యాపారాలకు ఎదురయ్యే పెద్ద సవాలేంటంటే.. బ్రాండ్లు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి.
అయితే, పెట్టుబడి కొద్ది మొత్తంలో ఉంటుంది కాబట్టి బ్రాండ్ల మార్కెటింగ్ కష్టంగా మారింది. పెద్ద కంపెనీలైతే మార్కెటింగ్పై ఎక్కువగా ఖర్చుపెడతాయి. పైగా వ్యాపారంలో అవి పట్టువిడుపులను ప్రదర్శిస్తాయి. ఇలా చేయడం చిన్న కంపెనీలకు కష్టమైన వ్యవహారం” అంటుంది మాసుమ్. ఇక్కడే తనలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల అవసరం ఎక్కువగా ఉంటుందని చెబుతుంది.
ఇక కొవిడ్ మహమ్మారి చిన్న వ్యాపారాలను బాగా దెబ్బతీసింది. చాలా సంస్థలు మూతపడే పరిస్థితి తలెత్తింది. దీంతో మాసుమ్ ‘సపోర్ట్ ఇండియన్ డిజైనర్స్’ సిరీస్ మొదలుపెట్టింది. అలా చిన్న వ్యాపారాలకు తన పోస్టులు, స్టోరీల రూపంలో సహాయం చేయడం ద్వారా మాసుమ్ ప్రచారం తెచ్చిపెడుతున్నది. విపరీతమైన పోటీ ఉండే మార్కెట్లో ఆయా బ్రాండ్లు మరింత మందికి చేరువయ్యేలా చేస్తున్నది.