తప్పదు. మన చుట్టూ ఓ దుర్గమమైన దుర్గం నిర్మించుకోవాలి. ఎవరికి పడితేవారికి ప్రవేశం నిషిద్ధం. అందులోనూ ఓ మోస్తరు పరిచితులను అస్సలు నమ్మకూడదు. ఎవరికి తెలుసు? ఏ రూపంలో తోడేళ్లు దాడి చేస్తాయో, ఏ మూలన గుంటనక్కలు నక్కినక్కి ఉంటాయో? ఈ తాజా ఉదంతమే అందుకు సాక్ష్యం..
ఓ రోజు రాత్రి ఆమె వంట ఏర్పాట్లు చేస్తున్నది. తీరా చూస్తే ఫ్రిజ్లో కొత్తిమీర నిండుకున్నది. అన్నకేమో కొత్తిమీద ఘుమఘుమలు లేకపోతే, వంట రుచించదు. తేడా వస్తే కోప్పడతాడు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న.. ఇద్దరే ఓ కుటుంబం. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అన్న ముంబై శివార్లలోని ఓ కార్ఖానాలో పనిచేస్తాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. పేరుకు చెల్లి అయినా.. కమ్మగా వండిపెట్టడంలొ అమ్మలాంటిదే. అప్పటికే చీకటి పడిపోయినా, కొత్తిమీర సంగతి గుర్తుకొచ్చి.. ఇంటికి తాళమేసి మార్కెట్కు బయల్దేరింది. అప్పటికే చాలా దుకాణాలు మూసేశారు. రోడ్డు దాటుకుని తాము ఉంటున్న కాలనీకి అవతల.. ఇరుకిరుకు బస్తీకి వెళ్లింది. కొత్తిమీర దొరికింది కానీ, దారి మరిచిపోయింది. ఆ సందుగొందుల్లోంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అంతలో అన్న స్నేహితుడు కనిపించాడు. తన బండి ఎక్కమన్నాడు. ముఖ పరిచయమే కాబట్టి పెద్దగా ఆలోచించలేదు.
కొత్త ప్రాంతం కావడంతో, బైక్ ఎటువైపు వెళ్తున్నదీ అర్థం కాలేదు. అరగంట తర్వాత.. ఓ పాత భవనం ముందు ఆపాడు. ఇంట్లోకి ఆహ్వానించాడు. మొహమాటం కొద్దీ వెళ్లింది. హఠాత్తుగా తలుపులు మూసుకున్నాయి. అతనిలోని రాక్షసుడు బయటికొచ్చాడు. రాత్రంతా నరకం చూపాడు. తెల్లవారే సమయానికి ఆ కాముకుడు నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఎలాగోలా చెర నుంచి బయటపడింది. ఓపిక తెచ్చుకుని వీధిలోకి వచ్చింది. అడుగు ముందుకు వేయలేక అక్కడే కుప్పకూలిపోయింది. అంతలోనే జనం గుమిగూడారు. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఆ కామాంధుడిని అరెస్టు చేశారు. ‘తనే ఉద్దేశపూర్వకంగా నాతో వచ్చింది. మాది సంపన్న కుటుంబం. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నింది’ అంటూ న్యాయస్థానంలో బుకాయించబోయాడు ఆ దుర్మార్గుడు. ఆ కల్ల్లబొల్లి కబుర్లను ముంబై న్యాయస్థానం నమ్మలేదు. ఏడేండ్లు కఠిన కారాగార శిక్ష విధించింది.