ఆమెకు శాస్త్రీయ సంగీతంలో ఆదితాళం తెలుసు.. వెస్ట్రన్ మ్యూజిక్లో మేజర్ స్కేల్ వ్యవహారాలూ తెలుసు. తన్మయత్వంతో తలలూపించే కృతులు వచ్చు, ఉర్రూతలూగించే పాప్ సాంగ్సూ పాడగలదు. ప్రాగ్దిశ వీణపై క్లాసిక్ సరిగమలు పలికించగలదు. పాశ్చాత్య గిటారుపై మోడ్రన్ ర్యాప్ పండించగలదు. ఈ రెండిటినీ పక్కా శ్రుతిలో మేళవించి అద్భుతాలు సృష్టిస్తున్నది హైదరాబాద్కు చెందిన 24 ఏండ్ల శ్రుతి ధూళిపాల. సరికొత్త ప్రయోగాలతో శ్రోతలను అలరిస్తున్నది. తండ్రి వారసత్వంగా అబ్బిన సంగీత సారాన్ని మనసారా సాధన చేస్తూ, ప్రియమారా ఆలపిస్తూ ఔరా! అనిపిస్తున్నది.
శ్రుతి తండ్రి మృదంగ విద్వాన్ డీఎస్ఆర్ మూర్తి. మూడేండ్లున్నప్పటి నుంచే తండ్రి మృదంగ విన్యాసాలకు శ్రుతి శుభగంగా గొంతు కలిపేది. కూతురు ఉత్సాహం గమనించి సంగీతంలో శిక్షణ ఇప్పించారాయన. కాస్త పెద్దయ్యాక తండ్రి పాల్గొనే కచేరీలకు వెళ్లేది. అలా ఎల్.సుబ్రహ్మణ్యం, బాంబే జయశ్రీ లాంటి లబ్ధప్రతిష్ఠులైన సంగీతజ్ఞుల స్వర విన్యాసాలను నిశితంగా గమనించేది. వారినే ఆదర్శంగా తీసుకొని సాధన చేసేది. హైదరాబాద్ సిస్టర్స్గా పేరుమోసిన లలిత, హరిప్రియల దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. సరిగమలపై పట్టు సాధించిన తర్వాత అమెరికాలోని ‘ఇండియన్ రాగా’లో ఫెలోషిప్ సాధించింది. అక్కడ కర్ణాటిక్ ఓకల్స్లో లెవల్-5 సర్టిఫికెట్ కూడా పొందింది శ్రుతి.