హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం 5,559 కొత్త కేసులు నమోదుకాగా, అంతకు మించిన సంఖ్యలో 8,061 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు గురువారం 84.12 శాతంగా ఉండగా శుక్రవారం 84.81 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 81.9 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు మరుసటి రోజు హెల్త్ బులెటిన్ ఇస్తుండగా, శుక్రవారం నుంచి ఏ రోజుకారోజు విడుదలచేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 41 మంది మరణించారు. శుక్రవారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 984, రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్ మల్కాజిగిరిలో 372, వరంగల్ అర్బన్లో 296, నల్లగొండలో 208, సిద్దిపేట, కరీంనగర్లో 201 చొప్పున, ఖమ్మంలో 200 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో గురువారం 80 వేల మందికి టీకా లు వేశారు. ఇందులో 48వేల మంది మొదటి డోస్ తీసుకోగా, 32 వేల మంది రెండోడోస్ తీసుకున్నట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మొత్తం గా ఇప్పటివరకు 50.39 లక్షల మందికి టీకాలు వేసినట్టు వివరించింది.