ఖమ్మం, ఫిబ్రవరి 10 : దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి మహిళలంతా సిద్ధంగా ఉండాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని, దీనిపై మహిళలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత అధ్యక్షతన శనివారం ప్రారంభమైన వేదిక ఏడో మహాసభలకు ప్రముఖ వక్తలు హాజరయ్యారు. ముందుగా రచయిత్రుల వేదిక పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీబీసీ తెలుగు ఎడిటర్ రామ్మోహన్రావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా మాట్లాడారు. సోషల్మీడియా వేదికగా మహిళలపై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఈ ట్రోలింగ్ను తమ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఉపయోగించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. పాలకులు సైతం విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే పరిగణిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
గడిచిన 15 ఏళ్లుగా సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తున్నారని అన్నారు. వాటి వల్ల ప్రయోజనాలతోపాటు ట్రోలింగ్ వంటి అవాంఛనీయ ధోరణులు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల నాయకులు, కుల, మతతత్వ సంస్థల బాధ్యులు, అప్రజాస్వామికులు.. భిన్నాభిప్రాయాన్ని అణిచివేసేందుకు ట్రోలింగ్ను వ్యవస్థీకృతం చేసి లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. ఈ ట్రోలింగ్ వెనుక దేశంలోని పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయాజనాలు దాగి ఉన్నాయన్నారు. సమాజంలో ఏ చెడు ధోరణులైనా తలెత్తినప్పుడు దానికి ముందుగా బలయ్యేది స్త్రీలు మాత్రమేనని, అందులోనూ దళిత, మైనార్టీ తదితర పీడిత అస్థిత్వానికి చెందిన వారు ఉంటారని అన్నారు. ఈ సమస్యలను సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పనిచేస్తోందని, అందుకే స్త్రీలపై ట్రోలింగ్ అనే అంశాన్ని ఈ మహాసభలు ముఖ్యాంశంగా తీసుకున్నాయని వివరించారు. అనంతరం పలువురు వక్తలు వివిధ అంశాలపై ఉపన్యసించారు. ఆ తరువాత ‘ట్రోల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహాసభల సమన్వయకర్త రవిమారుత్, ప్రముఖులు నారాయణ వేణు, ఖాదర్ మొహియుద్దీన్, ఉరిమళ్ల సునంద, దేవకిదేవి, వేణుగోపాల్, కొండెపూడి నిర్మల, కృష్ణకుమారి, వనజ తదితరులు పాల్గొన్నారు.