భద్రాచలం, ఫిబ్రవరి 18: శ్రీరామనవమి కల్లా రెండో వంతెన పనులు పూర్తి చేయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. భద్రాచలం ఐటీడీవో కార్యాలయంలో ఆదివారం పాలకమండలి సమావేశం పూర్తయిన తర్వాత నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో తమ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపడతుందన్నారు. పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో త్వరలో కరకట్ట పనులు పూర్తి చేస్తామన్నారు.