రఘునాథపాలెం, మే 31: గోవులు దైవంతో సమానమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ రైతుల సహకారంతో సేకరించిన రూ.15 లక్షల విలువైన 150 ట్రాక్టర్ల వరిగడ్డిని బుధవారం ఖమ్మం నగరంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి 12 గోశాలలకు ట్రాక్టర్ల ద్వారా పంపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూగజీవాల పట్ల ప్రతిఒక్కరూ దయతో వ్యవహరించాలన్నారు. ఎండాకాలంలో గ్రాసం కొరత ఉంటుందని, గోశాలల్లో ఉంటున్న గోవులు ఆకలితో అలమటించవద్దనే సత్సంకల్పంతో వరిగడ్డి సేకరించామన్నారు. మూగజీవాలకు గ్రాసం అందించడం భగవంతుడిని పూజించడంతో సమానమన్నారు. తల్లిదండ్రులను గౌరవించుకున్నంత పుణ్యప్రదమన్నారు. ఏటా మే 31వ తేదీన తన పెళ్లి రోజు గోశాలలకు గ్రాసం అందిస్తున్నాన్నారు. ఇక ముందు కూడా ఇదే పరంపర కొనసాగిస్తానన్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని టేకులపల్లి గోశాలలో గోవులకు గ్రాసం అందించారు. కార్యక్రమంలో గోశాల బాధ్యులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, యల్లంపల్లి హనుమంతరావు, రాయల శేషగిరిరావు, రాయల బసవేశ్వరరావు, సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు.