నమస్తే నెట్వర్క్ : శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం. వరాలిచ్చే తల్లిగా కొలిచే వరలక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని మహిళలు ఇంట్లో ప్రతిష్ఠించి పువ్వులు, పండ్లు, గాజులు, చీర సారె, పసుపు, కుంకుమ సమర్పించి భక్తిప్రపత్తులతో పూజలు, వ్రతాలు నిర్వహించారు.
వివిధ రకాల పిండి వంటకాలు తయారు చేసి కుటుంబ సమేతంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి.. వరాలు కురిపించు తల్లీ అంటూ మొక్కుకున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. పలు ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.