శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరుపుకున్నారు. ఉదయమే ఇళ్ల గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి.. తీరొక్క పూలతో అలంకరించి.. ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించి పండుగ శోభను తీసుకొచ్చారు.
ఉదయమే తలంటు స్నానాలు ఆచరించి నూతన వస్ర్తాలు ధరించి ఇంటిల్లిపాది పూజా మందిరంలో ఇష్టదైవాలకు భక్తిభావంతో పూజలు చేశారు. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత కుటుంబ సభ్యులు స్వీకరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. కొత్త సంవత్సరంలో జన్మ నక్షత్రాలనుబట్టి యోగ క్షేమాలు, ఆదాయ వ్యయాల గురించి వివరించారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 9