ఖమ్మం, డిసెంబర్ 6 : పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోక్సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ అరవింద్ వ్యాఖ్యలు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని పేరొన్నారు. సంప్రదాయ సాగు వ్యవస్థను సమాధి చేసే రైతు చట్టాలు తెచ్చి అన్నదాతలను బీజేపీ పొట్టనబెట్టుకున్నదని విమర్శించారు.
సిగ్గులేకుండా రైతు సమస్యలపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగం కోసం నిరంతరం పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలపై ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. కేంద్రం వరి ధాన్యం కొనమని చెప్పడంతో తాము వరి పంట వేయవద్దని రైతులకు చెబుతుంటే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వరి వేయమంటున్నారని మండిపడ్డారు. కేంద్రం తమ రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ధాన్యాన్ని కేంద్రం తీసుకోకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని మరోసారి నామా హెచ్చరించారు.
తమ రాష్ట్ర రైతుల సమస్యలను సభ ద్వారా కేంద్రానికి వివరించేందుకు ప్రయత్నిస్తే కనీసం మైక్ కూడా తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు కేవలం ఆరోపణలు చేసేందుకు మైక్ ఇవ్వడం శోచనీయమని పేరొన్నారు. మోదీ సరారు పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
లోక్సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి ఆందోళనకు దిగారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. కేంద్రం తీరుకు నిరసనగా లోక్సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.