ఖమ్మం : టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతులకు అండగా ఊంటూ వారి ఆర్థికాభివృద్ధికి చేయూత నిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమవడంతో పెనుబల్లి మండల కేంద్రంలో అన్నదాతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు పెట్టుబడి సాయం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటి వరకు 58 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతన్నల కోసం రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు ద్వార సాగు నీరు అందించి రైతన్నకు వెన్నుదన్నుగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ సహాయం చేయకపోయినా సీఎం కేసీఆర్ తెలంగాణను ప్రగతి పథంలో నిలిపారన్నారు.