చుట్టూ దట్టమైన అరణ్యం.. కొండకోనల మధ్య ఆవాసం.. సంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. అడవితల్లి ఒడిలో ఒదిగి పయనం.. ఇలా విలక్షణ జీవనశైలి ఆదివాసీలది. వాళ్లే దేశానికి మూలవాసులు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ భవిష్యత్పై కోటి ఆశలు పెట్టుకుని మనుగడ సాగిస్తున్నారు. సామాజిక చైతన్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ అడవిబిడ్డల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేసి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. గిరిజన గూడేలను పంచాయతీలుగా మార్చారు. విద్యా ఉపాధి రంగాల్లో ఎస్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు. మాతృభాషలో బోధన జరిగేలా పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఆదివాసీలు ఏడువేల భాషల్లో మాట్లాడుతున్నారు. ఐదువేల భిన్న సంస్కృతులు వీరివి. భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6 శాతం ఆదివాసీలున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో కొన్ని ప్రాంతాలు 5వ షెడ్యుల్ ఏరియాలో చేర్చబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు సమీప ఆంధ్రప్రదేశ్తో కలిపి 12 లక్షలకు పైగానే ఆదివాసీలు నివసిస్తున్నారు. ఆదిమ జాతులైన గోండు, కొలాం, తోటి, ప్రధాన్, నాయకపోడు, కోయ, మన్నెవారు, చెంచు, గుట్టకోయ, కొండరెడ్లు తదితర ఆదివాసీ తెగలు మొత్తం 23 వరకు ఈ రెండు రాష్ర్టాల్లో జీవనం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు మైదాన ప్రాంతాల్లో సైతం నివసిస్తున్నారు.
అపురూప సంప్రదాయాలు..
బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిబిడ్డలు తమ మనుగడ సాగిస్తున్నారు. వీరికి అడవి అంటే ప్రాణం. కొండకోనల మధ్య ఆవాసం అటవీ ఉత్పత్తులను సేకరించడంతో పాటు వ్యవసాయమే వృత్తిగా చేసుకొని వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా వరి, జొన్నపంటలు ఎక్కువగా పండించి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని ఆహారానికి వినియోగిస్తున్నారు. మరో వైపు జిగురు, ఇప్పపువ్వు, చింతపండు, వివిధ రకాల అటవీ పండ్లను సేకరించి సంతలకు తీసుకొచ్చి వాటిని విక్రయించి తమకు కావాల్సిన వస్తువులను వస్తుమార్పిడి విధానం ద్వారా దక్కించుకుంటారు. గిరిజన సంప్రదాయం అపురూపం. వారి వేషభాషలు, కట్టుబాట్లు అపురూపంగా ఉంటాయి. స్థానికంగా దొరికే ఆభరణాలను ధరిస్తారు. ఆసక్తి గొలిపే వస్త్ర ధారణగావిస్తారు. ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉంటాయి. విలక్షణమైన ఆహార్యం వీరి సొంతం. పుట్టుక, మరణం తదితర సమయాల్లో తమ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు. పండుగ, ఉత్సవాల సమయంలో తర తరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తారు. పంటలు వేసేటప్పుడు, కోసేటప్పుడు ప్రత్యేక శైలిలో భూమిపూజలు పిల్లలు, పెద్దలు ఆనందోత్సవాలతో గడుపుతారు.
పోడుపట్టాల పంపిణీ చరిత్రాత్మకం..
దశాబ్దాల నుంచి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. దీనిలో భాగంగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 51 వేల మందికి పట్టాలు అందడం విశేషం. ఇక నుంచి గిరిజనులకూ రైతుబంధు పథకం వర్తించనుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక చైతన్యం వైపు అడుగులు..
తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యాన్నిస్తున్నది. మారుమూల గిరిజన గూడేలుగా పంచాయతీలుగా మార్చింది. నెల నెలా ఠంచనుగా గూడేల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి జిల్లాలోని కొన్ని పంచాయతీలు ఇప్పటికే జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయి. గిరిజనుల స్వయం ఉపాధి కోసం సర్కార్ ట్రైకార్ రుణాలు అందజేస్తున్నది. గిరివికాస్ ద్వారా రాయితీపై మోటర్లు అందిస్తున్నది. అలాగే ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో వందలాది మంది అభ్యర్థులు టీచర్లుగా పోస్టింగ్స్ తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం సిఫార్స్ మేరకు మణుగూరు ప్రాంతానికి చెందిన సి.రామచంద్రయ్య వాద్యకళాకారుడిని పద్మశ్రీ వరించింది. భద్రాచలం ఐటీడీఏ నాలుగు జిల్లాల పరిధిలో 32 మండలాల్లో విస్తరించగా ఈ మండలాల్లో కోయజాతి 22.30 లక్షలు, కొండరెడ్లు 1300 మంది ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉంది.
భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమానికి ప్రత్యేక కృషి జరుగుతోంది. మారుమూల పల్లెల్లో విద్య సౌకర్యాలు కల్పించడంతో గిరిబిడ్డలు అక్షరం వైపు అడుగులు వేస్తున్నారు. వీరికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. గిరిబిడ్డలకు విద్యాలయాలు, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం, చికెన్, మటన్, గుడ్లు తదితర వాటితో పౌష్టికాహారం అందిస్తున్నారు. కావలసిన స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నారు. విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. వీరిలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు క్రీడల్లోనూ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందుతోంది. గిరిజనులు వ్యవసాయపరంగా అభివృద్ధి చెందేందుకు సబ్సిడీపై రుణాలు, యంత్రాలను ఐటీడీఏ అందజేస్తోంది. గిరిజన రైతాంగానికి పెద్దఎత్తున పోడు భూములకు పట్టాలిచ్చారు. మారుమూల గిరిజన పల్లెల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో కోయ, బంజార సబ్జెక్టులను ప్రాథమికస్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. మాతృభాషలో బోధన సాగేలా ప్రణాళికలు అమలవుతున్నాయి.
చాలా సంతోషంగా ఉంది..
మా కుటుంబం రెండు దశాబ్దాల నుంచి పోడు సాగుచేకుంటూ జీవిస్తున్నది. పోడు భూమికి పట్టా తీసుకోవడం మా చిరకాల కల. జీవితంలో ఇక పట్టా తీసుకోలేం అనుకున్నాం. భూమిని కాపాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులుపడ్డాం. అటవీశాఖ నుంచి వేధింపులు ఎదుర్కొన్నాం. మాకు న్యాయం చేయండని గతంలో ఎన్నో ప్రభుత్వాలను వేడుకున్నాం. అయినా.. ఫలితం లేకపోయింది. సీఎం కేసీఆర్ మాపై దయ చూపి పట్టాలు అందించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
– తాటి లక్ష్మీభాయి, బండ్లవారి గుంపు, అశ్వాపురం మండలం
సీఎం కేసీఆర్తోనే గిరిజనుల అభ్యున్నతి..
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు మిషన్ భగీరథ జలాలను తీసుకొచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశన వాటికలు, డంపింగ్యార్డులు నిర్మించారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోడు పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. సీఎం కేసీఆర్తోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యం.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే