బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్. బంజారాల ఆలోచనల్లో, వారి జీవన విధానంలో పలు మార్పులు తీసుకువచ్చిన మహానుభావుడు. మేరామాయాడి(భవాని) సేవకుడిగా ఆమెకే షరతులు విధించి సాధించుకున్న మహాభక్తుడు. ఆయన జీవితంలో మేరామాయాడి సేవతోపాటు బంజార జాతి ఉన్నతి కోసం కృషి చేశారు. బ్రిటీష్ వారు బంజారాలను పెడుతున్న హింసలను ఎదిరించి పోరాడి.. జాతి పునరుజ్జీవానికి కంకణం కట్టుకున్నారు. ఫిబ్రవరి 15న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తిలోని రాంజీనాయక్తండాకు చెందిన రాంజీనాయక్ ముగ్గురు కుమారుల్లో ఒకరు భీమానాయక్. ఆయనకు ధర్మినిబా యి అనే ధర్మపత్ని ఉంది. వీరికి 3,755 ఆవులు, 6,400 ఎద్దులు, గరాసియసాండ్(ఆంబోతు), తొళా రం గుర్రాలున్నాయి. అయితే వీరికి సంతానం మాత్రం కలగలేదు. బంజారాల ఆరాధ్యదైవాలైన సాతిభవానిలలో (తొళ్జా, మత్రాల్, హింగళా, ధ్వాళంగర్, కంకాళి, దండి, సీత్లా) ఒకరైన మేరామాయాడి ధర్మినిబాయి కలలో కనిపించి.. మీకు సంతానప్రాప్తి కలగజేస్తాను పుట్టిన మొదటిబిడ్డకు 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతడిని భగత్(సేవకుడు)గా నియమించాలని చెప్పింది. అందుకు భీమానాయక్ దంపతులు సంతోషించినప్పటికీ.. మొదటి సంతానాన్ని భగత్గా చేయాల్సి వచ్చినందుకు బాధపడతారు. వీరికి 1739 ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జన్మించారు. అనంతరం హప, బద్దు, బాణా అనే సంతానం కలిగారు.
అమ్మవారికే షరతులు
సేవాలాల్ అమ్మవారికి కొన్ని షరతులు పెట్టి తాను భగత్గా ఉంటానని మాట ఇస్తాడు. తాను మాత్రం శాఖాహారిగా ఉంటూ మద్యం సేవించనని ఆ వెసులుబాటుతో సేవకుడిగా మారుతాడు. సంవత్సరానికి ఒకసారి కడావ్, చుర్మో(బియ్యం పిండితో చేసిన) నైవేద్యాన్ని సమర్పిస్తామని, జీవహింసను చేయబోమని చెబుతాడు. తన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు అమలు కావాలని కోరడంతో దేవి అన్ని వరాలను ఇచ్చేందుకు సేవాలాల్ను అనుగ్రహిస్తుంది. సేవాలాల్ తన చివరిదశలో యత్మర్ జిల్లా డిగ్రాస్ తాలూకాలోని రూయీ అనే తండాలో నివసించాడు. 1806 ఏడాది ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని బేరార్లోని నేటి అకొలా జిల్లాలకు డిగ్రస్ నుంచి 4కిలోమీటర్ల దూరంలో పొహర అనే గ్రామంలో తన పార్థివ దేహాన్ని వదిలారు. పొహర ప్రాంతాన్ని 1870లో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గంలో సేవాగడ్ నిర్వహిస్తారు.
నేడు సేవాలాల్ జయంతి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న సేవాలాల్ 284వ జయంతిని నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలకు సరిపడా నిధులను కేటాయించారు. ప్రతి తండాలో సేవాలాల్ మహరాజ్ జయంతిని నిర్వహించనున్నారు. అధికారులతోపాటు గిరిజన సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో జయంతి నిర్వహించనున్నారు.