‘గిరి’ బిడ్డలకు అడవే తల్లి.. అటవీ ప్రాంతమే ఆవాసం.. అడవిలో దొరికే సహజ సంపదే భుక్తి.. అలాగే తునికాకు సేకరణ తరతరాలుగా గిరిజనుల ఆదాయ వనరు.. ఏటా వేసవిలో సుమారు రెండు నెలల పాటు ఆదివాసీలు తునికాకు తెంచి ఉపాధి పొందుతారు.. సేకరించే సమయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటారు.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటారు.. వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటారు.. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆకు సేకరిస్తే వారికి అందే ప్రతిఫలం అంతంతమాత్రమే. వారి కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2015- 21 వరకు నిలిచిపోయిన బోనస్ అందజేస్తామని ప్రకటించింది. ఇలా భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 1.10 లక్షల మంది ఖాతాల్లో మొత్తం రూ.75 కోట్లు జమ కానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (నమస్తే తెలంగాణ): అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇప్పటికే గిరిజనుల సంక్షేమం కోసం అనేక సంక్షమే పథకాలు అమలు చేస్తున్న సర్కార్ తాజాగా తునికాకు కార్మికులకు శుభవార్త ప్రకటించింది. జిల్లాలో 2015 నుంచి 2021 వరకు తునికాకు సేకరించిన 1,10,500 మంది లబ్ధిదారులకు విక్రయాల్లో వచ్చిన లాభంలో కొంత బోనస్గా ఇవ్వనున్నది. ఇలా కార్మికుల ఖాతాల్లో రూ.75 కోట్లు జమకానున్నాయి. ఇప్పటికే అటవీశాఖ కార్మికుల బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించింది. ఆరు సంవత్సరాల బోనస్ ఒకేసారి వస్తుండడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీవ్యాప్తంగా..
భద్రాద్రి జిల్లాలో ప్రతి వేసవిలో గిరిజనులు వన్యప్రాణులు, ప్రకృతి వైపరీత్యాలను సైతం లెక్కచేయకుండా అటవీ ప్రాంతంలో తునికాకును సేకరిస్తున్నారు. ఏటా సుమారు 20 వేల మంది తునికాకు సేకరించి ఉపాధి పొందుతారు. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, ములకలపల్లి, రేగళ్ల, మైలారం గ్రామాల్లో తునికాకు సేకరించే వారి సంఖ్య ఎక్కువ. సాధారణంగా ఏటా తునికాకు విక్రయాల్లో వచ్చిన లాభంలో కార్మికులకు బోనస్ చెల్లించాల్సి ఉన్నది. కానీ సాంకేతిక కారణాలతో బోనస్ చెల్లింపులు నిలిచిపోయాయి. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో తునికాకు కార్మికులు ఎక్కువ. ఈ నెల 10 నుంచి మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బోనస్ చెల్లింపులతోపాటు పోడు భూముల సమస్యకూ పరిష్కారం చూపిస్తుండడంతో గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో కోతలు ప్రారంభం..
అటవీశాఖ అధికారులు ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేపట్టడంతో జిల్లాలో అటవీప్రాంత విస్తరణ మరింత పెరిగింది. దీంతోపాటు తునికాకు మొక్కలకు ప్రూనింగ్ చేయడంతో ఈసారి నాణ్యమైన ఆకు చేతికి వచ్చింది. ఈసారి కూడా వేసవి వరకు గిరిజనులకు పుష్కలంగా ఉపాధి దొరకనున్నది.
బోనస్ ప్రకటన ఆనందాన్నిచ్చింది..
మేమంతా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఎంతోకాలంగా మా సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఒక్కో సమస్యకు పరిష్కారం లభిస్తున్నది. పోడు సమస్యను ఒక కొలిక్కి తెస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా మరో వరాన్ని ప్రకటించారు. సంవత్సరాల పాటు నిలిచిపోయిన తునికాకు బోనస్ను ఇప్పిస్తూ మాకు మేలు చేస్తున్నారు. బోనస్ ప్రకటన ఆనందాన్నిచ్చింది.
– మోకాళ్ల మహేందర్, తునికాకు కార్మికుడు, చీమలగూడెం, గుండాల మండలం
స్వరాష్ట్రం వచ్చాక మొదటిసారి బోనస్..
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి తునికాకు బోనస్ ఇస్తున్నది. జిల్లాకు సుమారు రూ.100 కోట్ల బోనస్ రావాల్సి ఉండగా వీటిలో కేవలం పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన కూలీలకే రూ.75 కోట్ల బోనస్ అందనున్నది. ఈ నెల 10వ తేదీ నుంచి బోనస్ పంపిణీ చేస్తాం.
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు