భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాలు జిల్లాలో నాల్గోరోజు యధావిధిగా జరిగాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 48కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నాల్గో రోజు జిల్లా మొత్తం 19,255 మందికి కంటి పరీక్షలు చేయగా 6,881 మందికి కంటి అద్దాలను అందజేశారు. కంటి సమస్యలు ఎక్కువ ఉన్న 2,940 మందిని గుర్తించి వారికి పదిరోజుల్లో కళ్ల అద్దాలు వచ్చేలా ఏర్పాటు చేశారు.
నాకు కళ్లు సరిగ్గా కనబడడం లేదు. ప్రైవేటుకు వెళ్లలేక ఇక్కడకి వచ్చాను. మిషన్లో ముఖం పెట్టి కళ్లను చూశారు. కంటి సమస్య ఉందన్నారు. వారంరోజుల వరకు మందులు వాడమన్నారు. పదిరోజుల్లో అద్దాలు వస్తాయని చెప్పారు. మా ఊరోల్లంతా ఇక్కడికే వచ్చారు. కొంతమందికి అద్దాలు అప్పుడే ఇచ్చేశారు. నాకు చూపు సమస్య ఎక్కువగా ఉండడం వల్ల కళ్ల మంటలు వస్తున్నాయి. అద్దాలు ఉచితంగా ఇస్తామన్నారు.
– ఎస్.లక్ష్మి, పెనగడప, చుంచుపల్లి మండలం