రఘునాథపాలెం, నవంబర్ 27: దాదాపు 25 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు.. రెండేళ్లుగా రోడ్డంతా పగుళ్లు వచ్చి ప్రయాణానికి సంకటంగా మారింది. ఈ రహదారిలో ప్రయాణమంటేనే వాహనదారుల వెన్నులో వణుకుపుడుతోంది. దీంతో స్థానిక పెద్దలు, టీఆర్ఎస్ నేతలు రహదారి సమస్యను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు. గతంలో 12 అడుగుల వెడల్పుతో ఉన్న రహదారిని 23 అడుగుల వెడల్పుతో నిర్మించేందుకు నగరపాలక సంస్థ నిధులు మంజూరు చేసింది. ఇటీవలే మంత్రి పువ్వాడ ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పనులు శరవేగంగా చేపడుతున్నారు.
రోడ్డు పనులు చేపట్టడం సంతోషంగా ఉంది..
పాండురంగాపురం ప్రధాన రహదారితో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రోడ్డులో ప్రయాణం నరకయాతనగా ఉంటుంది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నిధులు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. దీంతో సంతోషంగా ఉంది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు కృతజ్ఞతలు.
-తంగెళ్లపల్లి శ్రీనివాసరావు, స్థానికుడు